డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
  • ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యే
  • డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్

ముద్ర నడిగూడెం:-నడిగూడెం మండల కేంద్రంలో ఆదివారం డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో టిఎస్పిఎస్సి బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ హాజరై మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షలు, డీఎస్సీ రద్దు కావడం, రకరకాల వివాదాలతో వరుస పోటీ పరీక్షలు రద్దు కావడంతో తీవ్రమనస్థాపానికి గురైన ప్రవళిక, భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించలేమన్న మానసిక ఆవేదనతోనే ఆత్మహత్య కి పాల్పడిందని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలిపిందనీ, గత 10 ఏళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ,మోసపూరిత వాగ్దానాలు చేస్తూ నిరుద్యోగ యువతను మభ్యపెడుతూ వచ్చిందనీ ఆరోపించారు.  బిస్వాల్ కమిటీ పిఆర్సి రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ అందుకు తగిన విధంగా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిందనీ , తెలంగాణ వచ్చినాక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు.

మరోపక్క రెండు దఫాలుగా అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు .2018 లో జరిగిన ఎన్నికల వాగ్దానంలో నిరుద్యోగులందరికీ 3016 /నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి మరొకసారి నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. గత సంవత్సరం 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించినప్పటికీ అవి హడావుడి ప్రచార ఆర్భాటానికే తప్ప చిత్తశుద్ధి లేదనీ ఎన్నికల ముందర మరోసారి నిరుద్యోగ యువత ఓట్ల కోసం నోటిఫికేషన్లు ప్రకటించింది తప్ప సకాలంలో పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనీ విమర్శించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు టీఎస్పీఎస్సీ బోర్డు ఘోర వైఫల్యాలు మూలంగా నిరుద్యోగ యువత మానసిక వేదనకు గురై నిరాశ నిస్పృహలతో ఉన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా  పోరాడి ఉద్యోగాలను సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. చనిపోయిన నిరుద్యోగి ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రవళిక కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లించాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగిందన్నారు. రాబోయే ఎలక్షన్లలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నడిగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు జమ్మి ఎల్లయ్య, కేశగానీ భద్రయ్య, మండల నాయకులు నోసినా అంజి, కాసాని రాంబాబు, చైతన్య, గోలి శ్రీకాంత్, తిరుమలేష్, వెంకీ తదిరులు పాల్గొన్నారు.