వేములవాడ బీజేపిలో టికెట్ల పంచాయతీ
![వేములవాడ బీజేపిలో టికెట్ల పంచాయతీ](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64e97e68c6f61.jpg)
- చెన్నమనేని వికాస్రావు ఎంట్రీతో మారీన సీన్
- తుల ఉమ, ఎర్రం మహేశ్ లకు భంగపాటు తప్పేనా..?
- వేములవాడ బీజేపిలో నెలకొంటున్న అసంతృప్తి
- బీజేపి అధిష్టానానికి తలనొప్పిగా బీజేపి ఎమ్మెల్యే టికెట్
- మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడికే బీజేపి టికెట్ అంటూ ప్రచారం
ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ బీజేపి ఎమ్మెల్యే టికెట్ పంచాయతీ తెరపైకి వచ్చింది. బీజేపి సినియర్ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయకుడు చెన్నమనేని వికాస్ రావు ఉన్నట్లుండి బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ను కలిసిన ఫోటోలు వైరల్ కావడంతో ఇప్పటికే బీజేపి టికెట్ కోసం ప్రయత్నం చేసి వేములవాడ నియోజక వర్గంలో ఖర్చు పెట్టుకోని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్ లకు భంగపాటు తప్పేలా లేదు. దీంతో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలాలు రగులుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు సామాజిక సేవా కార్యక్రమాలకు పరిమితం ఐన చెన్నమనేని వికాస్ రావు ఏ పార్టీలో చేరుతాడో ఎవరికి అంతు చిక్కలేదు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుకు టికెట్ మిస్సయితే అవకాశం వస్తే బీఆర్ఎస్ కూడా వస్తారని ప్రచారం కొనసాగింది.సీఎం కేసీఆర్ వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ను చల్మెడ లక్ష్మీనరసింహారావుకు కేటాయించడం.. అసంతృప్తికి లోనైన చెన్నమనేని రమేశ్ బాబు జర్మని నుంచి నేరుగా హైదరాబాద్ లోని సీఎం నివాసం ఉండే ప్రగతి భవనంకు వెళ్లడం అందే రోజు చెన్నమనేని వికాస్ రావు బండి సంజయ్ ని కలవడం అంతా ప్లాన్ ప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. బీజేపిలో ఈ నెల 30న వికాస్ చేరి టికెట్ సాధిస్తే చెన్నమనేని రమేశ్ బాబు పార్టీ వీడి వికాస్ రావుకు ఎక్కడ సపోర్టు చేస్తారో అని రాష్ట్ర స్థాయి పదవి ఆఘామేఘాల మీద ప్రకటించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వికాస్ రాకతో వేములవాడ బీజేపిలో ముసలం రాజుకుంటుంది. ఇప్పటికి ఇప్పుడు వచ్చి బీజేపి టికెట్ తీసుకుపోతాడనే సమాచారంతో బీజేపి వేములవాడ నాయకులు బండి సంజయ్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. తాము కీలక సమయంలో బండి సంజయ్ను నమ్ముకొని పార్టీలో చేరామని ఇప్పుడు ఉన్నట్లుండి వికాస్ రావు వస్తే ఆయనుకు ఏం ఇస్తారని అడిగేందుకు సిద్దవమవ్వుతున్నారు. వేములవాడ బీజేపి టికెట్ బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఇటు తుల ఉమ, అటు ఎర్రం మహేశ్ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా అవకాశం వస్తే..టికెట్ ఇస్తే తాను కూడా పోటీలో ఉంటానని బీజేపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొంటున్నాడు. ఏది ఏమైన చెన్నమనేని వికాస్ రావు రాకతో బీజేపి లో రాజకీయ సీన్ మారిపోయింది అని చెప్పాలి. బీజేపి టికెట్ పంచాయతీ రాజకీయాలు ఎక్కడిదాక వెళతాయో వేచిచూడాలి.