అట్రాసిటీ కేసులను చట్ట ప్రకారంగా పారదర్శకంగా విచారణ చేపట్టాలి

అట్రాసిటీ కేసులను చట్ట ప్రకారంగా పారదర్శకంగా విచారణ చేపట్టాలి

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : అట్రాసిటీ కేసులను చట్ట ప్రకారంగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళ వారం  సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్ ,మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ లపై జరుగుతున్న దాడుల పై కేసులు నమోదు చేయడం, త్వరితగతిన విచారణ చేపట్టి దోషులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం జరుగుతుందని, విచారణ అధికారులకు సహకరించాలని, బాధితులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు.

యువత చెడు అలవాట్ల బారిన పడకుండా చట్టంఫై  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్థానికంగా ఉన్న యువజన సంఘాలు, స్వచంద సంస్థలు, అధికారులు, పోలీసు అధికారుల సహకారంతో సామాజిక దృక్పథంతో నియోజక వర్గాలలో స్థానిక ఎమ్మెల్యే ల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 262 కేసులకు  2.27 కోట్ల పరిహారంకు  47 మందికి 54.37 లక్షలు చెల్లించడం జరిగిందని, మిగతా 215 కేసులను 1.73 కోట్లు చెల్లించవలసి ఉందని తెలిపారు.  బడ్జెట్ కోసం ఆర్థిక శాఖా మంత్రి, కార్యదర్శులను కలిసి నిధులు మంజూరుకు కోరతామని తెలిపారు. 

సివిల్ రైట్స్ డే లను నిర్వహించాలని అన్నారు. హత్య కేసులకు సంబంధించిన కుటుంబాల బాధితులకు కోరిన విధంగా సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యాలయాల్లో డ్రాప్ అవుట్ లు లేకుండా చూడాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చట్ట ప్రకారం విచారణ వేగవంతం చేయాలని, ఫాల్స్ కేసులు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కేసుల ప్రాధాన్యతకు అనుగుణంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

జిల్లాలో కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, హత్యకు గురై మరణించిన కుటుంబాల వారికి ఉపాధి, ఇళ్లు, వ్యవసాయ భూములు మంజూరు చేయాలని పలువురు సభ్యులు కోరారు. ఎస్పీ ఎగ్గడి భాస్కర్ మాట్లాడుతూ, కేసుల విచారణ చేపడు తున్నామని, అవసరమైన ద్రువపత్రాలు సేకరిస్తున్నామని, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో  జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, గ్రంధాలయం చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, ఆర్డీవోలు మాధురి, వినోద్ కుమార్, డిఎస్పీ లు రవీందర్ రెడ్డి, రాజ శేఖర్, డిఎస్డిఓ రాజ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.