యువత డ్రగ్స్ కు బానిస కావద్దు

యువత డ్రగ్స్ కు బానిస కావద్దు

డ్రగ్స్, గంజాయి నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు
జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: డ్రగ్స్ కు యువత బానిస కావద్దు- బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ  ఎగ్గడి  భాస్కర్  యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవంను పురస్కరించుకొని ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమౌతుందని అన్నారు.తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం  దృష్టిపెట్టాలని  ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తు ను అందకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు. మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. 

పోలీస్ శాఖ జిల్లాలో  డ్రగ్స్, గంజా నివారణ పట్ల యువతకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  2022లో   జిల్లా లో 11  గంజాయి కేసులు నమోదు కాగా ఇందులో 32 మoది  ని అరెస్టు చేయడం తో పాటు 17.620 కిలోల గంజాయి ని,11 గంజాయి మొక్కలను సీజ్  చేయగా, 2023లో  5 కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేసి 71.238 కిలోల  గంజాయిని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.