భయం తెలియని వ్యక్తి గద్దర్​

భయం తెలియని వ్యక్తి గద్దర్​
  • కాల్పుల ఘటనపై తప్పుడు ప్రచారం చేశారు
  • ఆ తర్వాత మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం
  • మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
  • గద్దర్ కుటుంబీకులకు పరామర్శ

ముద్ర, తెలంగాణ బ్యూరో : గద్దర్ అంటే భయం తెలియని వ్యక్తి అని, ఆయన భావి తరాలకు ఆదర్శవంతుడని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం చంద్రబాబు గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.  1997లో గద్దర్ పై కాల్పులు జరిగాయని, ఆ ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్ తనతో నేక సార్లు మాట్లాడారని, తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటేనని, పేదల హక్కుల పరిక్షణ కోసమే ఇద్దరం పోరాడామన్నారు. 

  • తప్పుడు ప్రచారం చేశారు..

 1997లో గద్దర్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటనలో ఏం జరిగిందనే విషయాలపై గద్దర్ తనతో అనేక సార్లు మాట్లాడారని గుర్తు చేశారు. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారని, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకమన్నారు. ప్రజాయుద్ధ నౌక పేరు వింటే గద్దర్ గుర్తొస్తారన్నారు. గద్దర్ జీవితం భావి తరాలకు ఆదర్శమని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం ఎవరో అందరికీ తెలుసని, హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయని చంద్రబాబు అన్నారు.

  • హాట్ టాపిక్ గా మారిన ‘సాయుధ పోరాటం’ వ్యాఖ్యలు..

తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కీలక పాత్ర పోషించారని, అలా ఎన్నో ప్రజా పోరాటలకు నాంది పలికారని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అంటూ అవగాహనా రాహిత్యంతో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా 1946 నుంచి 1948 వరకు జరిగిందే తెలంగాణ సాయుధ పోరాటం. ఈ ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. గద్దర్ 1949 లో మెదక్ జిల్లా తూప్రాన్ లో జన్మించారు. అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటం ముగిసింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్ లో విలీనం చేశారు. తాను పుట్టకముందే జరిగిన సాయుధ పోరాటంలో గద్దర్ ఎలా పాల్గొంటారు..? అన్నది చర్చనీయాంశమైంది. అయితే తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని ‘మా భూమి’ పేరుతో నర్సింగరావు సినిమా తీశారు. ఆ సినిమాలో ఉద్యమకారుడి పాత్రలో గద్దర్ నటించారు. చిత్రంలోని ‘బండెనకబండి కట్టి.. పదహారెడ్ల బండి కట్టి.. ఏ బండ్లా వస్తవ్ కొడకా నైజాము సర్కరోడా’ అనే  పాట రాష్ట్రవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యంది. ఆ సినిమా పాటను చూసే గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు భావించి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా దాదాపు పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబుకు తెలంగాణ సాయుధ పోరాటంపై అవగాహన లేకపోవడం గమనార్హం.