టెన్త్ పరీక్ష కేంద్రం సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రంను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ భాషా పరీక్షకు 10,692 మంది రెగ్యులర్, ఒక ప్రైవేట్ విద్యార్థి పరీక్ష వ్రాయవలసి ఉండగా 10,670 మంది విద్యార్థులు అనగా 99.78 శాతం హాజరయ్యారు. కాగా 23 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు ఉండాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్ అనుమతించరాదని సూచించారు.
కాపీయింగ్ జరుగకుండా పర్యవేక్షించాలని ఇన్విజిలెటర్స్ ను ఆదేశించారు. విద్యార్ధులకు కల్పించిన మౌళిక వసతులను పరిశీలించారు. ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఏ.యెన్.ఏం. కు సూచించారు. కాగా అదనపు కలెక్టర్ రమేష్ రామాయంపేటలోని వివేకానంద పాఠశాల పరీక్షా కేంద్రాన్ని, జిల్లా విద్యాశాఖాధికారి మెదక్, రామాయంపేట, నిజాంపేట్ లోని కేంద్రాలను, మెదక్ ఆర్.డి.ఓ. మెదక్, రామాయంపేటలోని కేంద్రాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, అల్లాదుర్గ్, రేగోడ్, పెద్ద శంకరంపేటలోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. మెదక్ జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు