లక్ష సాయానికి అర లక్ష దరఖాస్తులు

లక్ష సాయానికి అర లక్ష దరఖాస్తులు
  • ఈ నెల 20 వరకూ చాన్స్​
  • సమీక్షించిన మంత్రి గంగుల
  • హాస్టల్ సీట్ల కోసం వెబ్ సైట్ షురూ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష సాయానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ. ల‌క్ష ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకూ 53 వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయ‌ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దీనిపై మంత్రి సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తులకు ఘన వైభవం తీసుకొచ్చి వారి జీవితాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని అన్నారు. కులవృత్తికి ఉపయోగపడే ముడిసరుకు, పనిముట్లు కొనుగోలు చేసేందుకు ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా, తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ. ల‌క్ష సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు పథకానికి సంపూర్ణంగా ఆన్‌లైన్‌ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని, ఎట్టిపరిస్థితులలోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కల‌వాల్సిన అవసరం లేదని, ఆదాయ పత్రాలు సైతం 2021 ఏప్రిల్ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయని అన్నారు. కలెక్టర్లు సైతం ఆదాయ‌ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. చాలా సరళంగా ఉన్న అప్లికేషన్ ఫారం దరఖాస్తుదారులు తమ స్మార్ట్ ఫోన్ల నుండి సమర్పించవచ్చని సూచించారు.

బీసీ హాస్టళ్ల వెబ్‌సైట్ ప్రారంభం

రాష్ట్రంలోని 703 బీసీ ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇక నుంచి సంపూర్ణంగా ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ https://bchostels.cgg.gov.in సచివాలయంలో  అధికారికంగా లాంచ్ చేసారు. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అందుబాటులోకి తెచ్చామని, వెబ్‌సైట్‌లో సూచించిన ఆన్‌లైన్ అడ్మిషన్ ఫామ్ నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్ చేసుకొని ప్రవేశానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, టాడీ టాపర్స్ కార్పోరేషన్ ఛైర్మన్ పల్లె రవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.