గులాబీమయం.. మెదక్ పట్టణం

ముఖ్యమంత్రి కెసిఆర్ రాకతో మెదక్ పట్టణం గులాబీమయంగా ముస్తాబయింది. మెదక్ పట్టణ ప్రధాన రహదారి, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ భవన్, భారీ బహిరంగ సభ ప్రాంగణం ప్రాంతంలో పెద్ద ఎత్తున కటౌట్లు, గులాబి బైరాకులు, జెండాలతో అలంకరించారు. పలుచోట్ల భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆకాశంలోకి బెలూన్లను ఎగురవేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బిఆర్ఎస్ భవన్ ప్రారంభించనున్నారు. జిల్లా మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని గులాబీమయంగా తీర్చిదిద్దారు. గులాబీ బాస్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. వెల్కమ్ బోర్డు నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించేలా రోడ్డు వెంబడి మహిళలు, కార్యకర్తలు నిల్చోనున్నారు. కెసిఆర్ సభను విజయవంతం చేయాలని పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.