అధికారులు అప్రమత్తంగా ఉండాలి మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశం
హైదరాబాద్: సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిశోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, కలెక్టర్ తో మంత్రి మాట్లాడారు. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని చెప్పారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని చెప్పారు.
నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలన్నారు. అత్యవసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని చెప్పారు.