ఆ ఇద్దరు రాక్షసులను పారదోలాలి

ఆ ఇద్దరు రాక్షసులను పారదోలాలి

తుంగతుర్తి: తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే   బీఆర్ఎస్, బీజేపీ రాక్షసులతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోరాడాల్సి ఉందని,  ఆ  ఇద్దరు రాక్షసులను పారదోలాలని ఏఐసీసీ పరిశీలకుడు, కర్ణాటక ఎమ్మెల్యే శ్రీనివాసు మానె అన్నారు.  మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  చెవిటి వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో  ఆయన  మాట్లాడారు. కర్ణాటకలో తాము ఒక్క రాక్షసుడుతోనే పోరాడామని,  అది బీజేపీ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అహంకారంతో,  అధికార ధీమాతో ఎన్నో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రజలపై బలవంతంగా  రుద్దుతోందని  విమర్శించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఉందని,  కార్యకర్తలు ఆ వ్యతిరేకతను సద్వినియోగం చేసుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు.   తుంగతుర్తి  నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, తుంగతుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.