దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ..

దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణ..
  • అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాలు
  • గురుగ్రామ్​లో కొట్టుకుపోయిన వాహనాలు
  • మహారాష్ర్ట మున్సిపాలిటిని ముట్టడిస్తామని ప్రజల హెచ్చరికలు
  • తెలుగు రాష్ర్టాల్లోనూ భారీ వర్షాలు

ఢిల్లీ: ఈ ఏడాది కాస్త ఆలస్యమైనా నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోబాటు, ముంబై, హర్యానా, చంఢీఘడ్​, గుర్​గావ్​, యూపీ, మధ్యప్రదేశ్, జమ్మూ దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచే రుతుపవనాల విస్తరణతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఏకకాలంలో దేశమంతటా వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుందని వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు దేశంలో విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం వెల్లడించింది. ఆరు దశాబ్దాల కిందట ఇలా జరిగిందని, చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలు ప్రవేశించినట్టు పేర్కొంది. ఈ యేడాది గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని ఆయా ప్రాంతాలు కూల్​కూల్​గా మారిపోయాయి. ఇక పలుచోట్ల భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై సామాన్య జనజీవనానికి తీవ్ర విఘాతం ఏర్పడింది. గత 24 గంటల్లో ముంబయి, ఢిల్లీతో సహా ఆయా రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. 

మరోవైపు మహారాష్ర్టలోని పలు ప్రాంతాల్లో నాలాల్లోని నుంచి పొంగుతున్న నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న నాలాల వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగ చిన్నపాటి వర్షాలకు కూడా ఇళ్లలోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నాలాల పునరుద్ధరణ పనులు చేపట్టకుంటే ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా రోడ్లపై నీరు చేరడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడంలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. ఒక్కవర్షానికే రోడ్లపై నీరు నదుల్లా నిలిచిపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. గురుగ్రామ్​లో పడ్డ వర్షానికి పలు వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

తెలుగు రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు విస్తరించడంతో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకూ  రాష్ర్టవ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. రాబోయే రోజుల్లో కుంభవృష్టి వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే మూడు రోజులు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతంలో భారీ వర్షాలు కురవబోతున్నాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.