గణపవరం రోడ్డుని పునర్ నిర్మించాలి - డివైఎఫ్ఐ
![గణపవరం రోడ్డుని పునర్ నిర్మించాలి - డివైఎఫ్ఐ](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64dc76e35e720.jpg)
మునగాల ముద్ర : 23 గ్రామాలకు ప్రధాన రహదారిగా ఉన్న మండల కేంద్రంలోని గణపవరం రోడ్డుని మండల కేంద్రం నుండి గణపవరం వరకు డబల్ రోడ్డు గా పునర్ నిర్మాణం చేపట్టాలని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ డిమాండ్ చేశారు .మంగళవారం మండల కేంద్రంలో కురిసిన చిన్నపాటి వర్షానికి గణపవరం రహదారిపై మోకాళ్ళ లోతు నీరు నిలిచి ఉండడంతో. డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో రహదారిపై వర్షపు నీటి మడుగులో వరి నాట్లు వేసి డివైఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్ మాట్లాడుతూ, మండల కేంద్రం నుండి మూడు మండలాలకు మరియు 23 గ్రామాలకు ప్రధాన రహదారిగా ఉన్న ఈ రహదారిపై గణపవరం నుండి కీతవారిగూడెం వరకు రహదారి పునర్నిర్మానం చేసిన ఆర్ అండ్ బి అధికారులు. మండల కేంద్రం నుండి గణపవరం గ్రామం వరకు 5 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మాణం చేయకుండా వదిలేశారని, దీంతో ఇటీవల కురుస్తున్న వర్షానికి రహదారిపై మోకాళ్ళలోతు నీరు చేరి బురద మయంగా తయారై వాహనదారులు మరియు ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు రైతులు ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారని, కావున ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే స్పందించి మండల కేంద్రం నుండి గణపవరం వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనుల్ని తక్షణమే ప్రారంభించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు దేవారం శ్యామ్ సుందర్ రెడ్డి, సిరికొండ నవీన్, సిరికొండ రాకేష్, బానోతు గోపి, మహేష్, ఏ అచ్యుత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.