నంద్యాలలో మిత్రుడి ఇంటికి అల్లు అర్జున్.. ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు తన బాబాయి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి రామ్ చరణ్ చేరుకున్నవేళ, నంద్యాలలోని తన మిత్రుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డితో కలిసి నంద్యాలకు వెళ్లారు. ఇక్కడ విశేషమేమిటంటే... మూడు రోజుల క్రితమే పవన్ కల్యాణ్ కు మద్దతుగా అల్లు అర్జున్ ఎక్స్ లో ట్వీట్ పెట్టడం. చివరి రోజు ప్రచారం సమయంలో ఆయన తన మిత్రుడి ఇంటికి చేరుకోవడం రాజకీయంగా పెద్ద కలకలమే రేపింది. పవన్ కల్యాణ్ కు దీటుగా ఎలా సమాధానం ఇవ్వాలా అని గత కొన్ని రోజులుగా మథన పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల చివరి రోజున పెద్ద ఆయుధమే అల్లు అర్జున్ రూపంలో దొరికింది. స్టయిలిష్ స్టార్ పర్యటన ఆ పార్టీకి పెద్ద ఆశాకిరణమైంది. అల్లు అర్జున్ తమకు మద్దతు ప్రకటించి ప్రచారం చేస్తున్నట్టుగా ఐ ప్యాక్ బృందాలు దీనికి మెగాస్టార్ ట్యాగ్ తగిలించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి.  తాను నంద్యాల వెళ్లడం ఇంత రాజకీయానికి దారితీస్తుందని అల్లు అర్జున్ ఊహించారో లేదో తెలియదు కానీ ఆయన మీడియాకు మాత్రం వివరణ ఇచ్చారు. తాను స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు వచ్చాను కానీ పార్టీకి కాదని అన్నారు. ఏ రాజకీయ పార్టీలతో తనకు సంబంధం లేదని విస్పష్టంగా చెప్పారు. ఏపీ రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడంతో జాగ్రత్తలు తీసుకోలేకపోయారని, ఇప్పటికే ఒక ముద్ర పడిపోయిందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ తండ్రి అరవింద్, ఆయన మేనత్త సురేఖతో పాటు బావ రామ్ చరణ్ పవర్ స్టార్ కు మద్దతుగా పిఠాపురం శనివారమే చేరుకోవడం ఇక్కడ విశేషం.