ఎద్దు పొడిచి బీటెక్ విద్యార్థి మృతి

ఎద్దు పొడిచి బీటెక్ విద్యార్థి మృతి

కేసముద్రం, ముద్ర: ఎద్దు పొడిచి బీటెక్ విద్యార్థి దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో గురువారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామ మాజీ సర్పంచ్ పనికెర పద్మ కొమరుమల్లు దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (19)  తమ ఎడ్లను తీసుకొని పొలం వద్దకు వెళ్లి దొడ్డిలో కట్టి వేస్తుండగా ఎద్దు అతన్ని చాతిలో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

అతన్ని చికిత్స కోసం మహబూబాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ప్రమాద ఘటనలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ హుటాహుటిన కోరుకొండపల్లికి చేరుకుని పద్మ  కొమురమల్లు దంపతులను పరామర్శించి ఓదార్చారు.