మద్యంమత్తులో వాహనాలు నడిపితే కేసులే * పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

మద్యంమత్తులో వాహనాలు నడిపితే కేసులే  * పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడటాన్ని  తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల స్వయంగా ప్రమాదాలకు గురవ్వడంతోపాటు ఇతరులకు ఢీకునడం వల్ల ప్రమాదాలు  జరుగుతున్నాయని చెప్పారు.

మద్యం సేవించి ఈ మధ్యకాలంలో పట్టుబడిన వాహనదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడటం అవమానకరంగా భావించాలన్నారు. మద్యంమత్తులో మెదడు పనిచేయక, శరీరం ఆధీనంలో ఉండక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపడం వల్ల శరీరభాగాలు విరగడం, తలకు తీవ్రమైన గాయాలు కావడం, మరికొందరు జీవచ్ఛవాలుగా మారి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మద్యంమత్తులో జరుగుతున్న ప్రమాదాలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చుతుండగా మరికొందరి కుటుంబాలు అనాధలుగా మారుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి రెండవసారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు. చేయడంతోపాటు వారి లైసెన్సులను రద్దుచేసేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. పోలీసు కేసులు నమోదైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోవడమే కాకుండా పాస్ పోర్టులు లభించవని చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్లనే ఎక్కువశాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జి చంద్రమోహన్ (పరిపాలన), ఏసిపి బి విజయ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.