పారదర్శకంగా ఈవీఎం యంత్రాల ఎఫ్ఎల్సీ నిర్వహణ
![పారదర్శకంగా ఈవీఎం యంత్రాల ఎఫ్ఎల్సీ నిర్వహణ](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64887b1308eea.jpg)
పటిష్ట భద్రత మధ్య ఎఫ్ ఎల్ సి నిర్వహణ: జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: జిల్లాలో పారదర్శకంగా ఈవీఎం ఎఫ్ఎల్సీ (ఫస్ట్ లెవల్ చెకింగ్) ని ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఈవీఎంమిషన్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పటిష్ట భద్రత తో ఎఫ్ ఎల్ సి నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ 12 మంది ఈసీఐఎల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. జిల్లాకు వచ్చిన ప్రతీ ఈవీఎం యంత్రంలోని బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల పనితీరు పరిశీస్తామన్నారు.
2019 బ్యాలెట్ యూనిట్లను, 1649 కంట్రోల్ యూనిట్లను, 1783 వీవీప్యాట్లను ఫస్ట్ లెవెల్ చెకింగ్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపడుతున్నామన్నారు. ఈవీఎం యంత్రాల చెకింగ్ పూర్తయ్యే వరకు ప్రతీరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా ఈవీఎం యంత్రాలను పరిశీలిస్తామన్నారు. యంత్రాలపై ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పరిశీలన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా వీడియో కెమెరాలో రికార్డు చేస్తూ నిర్వహిస్తామని, ఈవీఎంల పనితీరుపై ఎటువంటి అపోహలు ఉన్నా రాజకీయ పార్టీల ప్రతినిధులు వెంటనే తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.