సిఎం కేసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ..
![సిఎం కేసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ..](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_6404baece2e9d.jpg)
మహిళల సాధికారత కోసమే అనేక పథకాలు
మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో ఆరోగ్య మహిళ పథకం
అభయ హస్తం నిధులు వాపస్ ఇవ్వడానికి ఏర్పాట్లు
అభయ హస్తం మహిళల్లో అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు
మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి
దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం
స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు
కెటిఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్ల పంపిణీ
నియోజకవర్గంలో మహిళలను కాపాడుకునే బాధ్యత నాదే
ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో తొర్రూరులో ఘనంగా మహిళా దినోత్సవం
ముద్రప్రతినిధి, మహబూబాబాద్: సిఎం కేసిఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చింది. మహిళల సాధికారత కోసం సిఎం కేసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మహిళా దినోత్సవ కానుకగా రాష్ట్రంలో మహిళా ఆరోగ్య పథకాన్ని తెస్తున్నారని మంత్రి దయాకర్ రావు అన్నారు. అభయహస్తం నిధులను మహిళలకే మిత్తీతో సహా వాపస్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, అభయహస్తం మహిళల్లో అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ఆ..ట్రస్ట్ చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ రావు అధ్యక్షతన మందస్తుగా ఘనంగా మహిళా దినోత్సవం జరిగింది. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లికి భారీ ఎత్తున తరలి వచ్చిన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మేళ తాళాలు, బాణాసంచాలు, బతుకమ్మలతో ఎదురేగి, పూలు చల్లుతూ ఊరేగింపుగా సమావేశ స్థలానికి తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి, పురోగతి జరుగుతుందని, దేశలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాల బలోపేతం మన రాష్ట్రంలోనే జరిగిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన తొర్రూరుకు వస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా కుట్టుశిక్షణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టు మిషన్లు, సర్టిఫికేట్ల పంపిణీ చేస్తామన్నారు. అలాగే తనను ఇంతగా ఆదరించి, గెలిపిస్తూ వస్తున్న, నియోజకవర్గంలో మహిళలను కాపాడుకునే బాధ్యత నాదేనని మంత్రి అన్నారు. మహిళలందరికీ ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలకు అసలైన ఆత్మ బంధువు సీఎం కేసిఆర్ అని,సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలకు అగ్ర స్థానం లభిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలోనే కాదు, అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, అందుకే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందజేస్తున్నామన్నారు. మహిళలను మనమంతా మనతో సమానంగా గుర్తించాలని, అవకాశాలు అందిపుచ్చుకోవడం లో మహిళలు ఎవరికీ తీసిపోరన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణలో మహిళలకు స్థానిక సంస్థల్లో, మార్కెట్ కమిటీల్లో యాబైశాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.అనేక అవకాశాలు కల్పిస్తూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని,ఇందుకు ప్రతిగా మహిళలతో పాటు మనమంతా కేసిఅర్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలని మంత్రి దయాకర్ రావు అన్నారు. జిహెచ్ఎంసీ, జిడబ్ల్యూఎంసి చరిత్రలో మొదటి సారిగా మేయర్, డిప్యూటీ మేయర్ల పదవులను మహిళలకు కట్టబెట్టి ఈ ప్రభుత్వంలో మహిళా ప్రాధాన్యతను సీఎం చాటిచెప్పారన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా... మన రాష్ట్రంలో కుట్టు శిక్షణ చేపట్టడం జరిగిందని,పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో మొదటి విడతగా 5 కోట్ల 10 లక్షల రూపాయల ఖర్చుతో 3వేల మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు.
త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తారిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.నన్ను గెలిపించిన మీ రుణం తీర్చుకుంటానన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు సేవా గృహాలు, స్టేట్ హోమ్స్, రెస్క్యూ హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, వృద్ధాప్య గృహాలు, ప్రత్యేక పాలిటెక్నిక్, డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కాలేజీలు నిర్వహిస్తూ ఆడపిల్లలు, మహిళల సమగ్ర వికాసం, సంరక్షణ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతున్నదన్నారు.
వీటితో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల భద్రతకు షీటీమ్స్, ఒంటరి, వృద్ధ, వితంతు, బీడి కార్మిక, బోధకాలు, నేత, గీత మహిళలకు పెన్షన్లు ఇస్తూ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా మేనమామగా సిఎం కేసిఆర్ ఆదుకుంటున్నారని,దీనివల్ల గణనీయంగా బాల్యవివాహాలు తగ్గాయన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లు, అంగన్ వాడీ ఉద్యోగులు వేతనాలు పెంచుకున్నామని,అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా 21 లక్షల మందికి పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు.ఇందుకు యేటా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు.ఇలా అన్ని దశల్లో ఆడపిల్లలు, మహిళలను ఆదుకుని వారి సమగ్ర వికాసం, భద్రత కోసం ఈ ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతూ వారి సంక్షేమం, అభివృద్ధిలో నేడు దేశంలోనే ముందంజలో ఉందని దయాకర్ రావు తెలిపారు. ప్రభుత్వం కల్పించే ప్రతి పథకంలో భాగస్వామ్యమై వాటిని విజయవంతం చేస్తూ ప్రభుత్వానికి నిరంతరం అండగా కొనసాగుతున్న మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.