మనీష్​ సిసోడియాతో కలిపి కవిత విచారణ

మనీష్​ సిసోడియాతో కలిపి కవిత విచారణ

న్యూఢిల్లీ:ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది.  సిసోడియాను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ శనివారం ప్రశ్నించనుంది. ఈ నేపథ్యంలో.. మనీష్ సిసోడియాతో పాటు కవితను విచారిస్తామని ఈడీ కోర్టుకు వెల్లడించింది. మనీష్ సిసోడియాతో పాటు కలిపి విచారించేందుకు ఏడుగురికి నోటీసులు జారీ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. కవితకు, సిసోడియాకు ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.

కవిత, సిసోడియా, విజయ్ నాయర్ కుట్రకు పాల్పడ్డారని, సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు ఆప్‌కి చెల్లించారని ఈడీ పేర్కొంది. సిసోడియా వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు అతని పేరుపై లేవని.. తద్వారా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు.  మద్యం హోల్‌సేల్ వ్యాపారాన్ని కొందరికి మాత్రమే దక్కేలా కుట్రపూరితంగా లిక్కర్‌ పాలసీని అమలు చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుట్రను విజయ్‌నాయర్, సౌత్ గ్రూపు కలిసి కోఆర్డినేట్ చేశారని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ జరిగిందని ఈడీ పేర్కొంది. సిసోడియా తరపున విజయ్ నాయర్ ఈ వ్యవహారం నడిపారని.. ఈ వ్యవహారంపై కవిత, సిసోడియా మధ్య అవగాహన ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. 12 శాతం డీలర్ కమీషన్ అనే క్లాజ్‌ను పాలసీలో ఏకపక్షంగా చేర్చారని, ఇందులో మనీష్‌ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.