వైద్య సిబ్బంది అంకితభావంతో  పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు

వైద్య సిబ్బంది అంకితభావంతో  పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని ప్రభుత్వాసుపత్రులలో మౌలిక వసతులతో అన్ని సౌకర్యాలు కల్పించిందని, ఆ సేవలు రోగులకు అందేలా వైద్య సిబ్బంది అంకితభావంతో  పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులకు సూచించారు. రోగులను  ప్రేమ, అప్యాయతతో పలకరిస్తూ వైద్యం అందించాలని, అదే వారిలో సగం ధైర్యం నింపుతుందన్నారు.  గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ వార్డులను, ల్యాబ్ లను, ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు. థియేటర్ లో ఆపరేషన్ కు కావలసిన అన్ని ఎక్విప్మెంట్ మంచి కండిషన్ లో  ఉండాలని, సాంకేతిక సిబ్బంది సకాలంలో వచ్చేలా చూడాలన్నారు. వివిధ రికార్డులను పరిశీలించి  ఆసుపత్రికి వస్తున్న అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ ల  వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం చికిత్స పొందుతున్న  రోగులను పలకరించారు. కొందరు రోగులకు అల్పాహారం అందకపోవడం పట్ల నర్సులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ  మెనూ ప్రకారం రోగులకు  అల్పాహారం, భోజనం అందించాలని, ఇందుకు సంబంధించి ప్రతి వార్డులో డైట్ మెనూ ప్రదర్శించాలని అధికారులకు సూచించారు.  శిథిలావస్థలో  ఉన్న పాత డయాలసిస్ సెంటర్ భవనాన్ని తక్షణమే డిస్మెంటల్ చేయుటకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జూన్ లోపు వాటర్ లీకేజీలను అరికట్టాలన్నారు. ఆసుపత్రి మొదటి అంతస్తులో చిన్న పిల్లలకు వైద్యం అందించుటకు నిర్మించనున్న ఎర్లీ డిటెక్షన్ సెంటర్ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే టెండర్లు ఆహ్వానించి  పనులు మొదలు పెట్టాలని టీఎస్ఎండిసి ఈఈ రవీందర్ రెడ్డికి సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి  సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.చందు నాయక్,  తదితరులున్నారు.

నర్సాపూర్ లో ఇళ్లు పరిశీలన: నర్సాపూర్ మునిసిపాలిటీలో  నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ రాజర్షి షా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి పరిశీలించారు. చిన్న చిన్న పనులను ఈ నెలాఖరు నాటికీ పూర్తి చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. 
 252 ఇండ్లలో కిటికీలు, ఎలక్ట్రిఫికేషన్,  పెయింటింగ్, ప్లంబింగ్  వంటి మిగిలిపోయిన చిన్న చిన్న  పనులను ఈ నెలాఖరు నాటికి  పూర్తి చేస్తూ మౌలిక సదుపాయాలతో పాటు పరిసర ప్రాంతాలను చదును చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.వెంట పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ వెంకట గోపాల్, తహశీల్ధార్ ఆంజనేయులు, ఎంపిడిఓ, కాంట్రాక్టర్లున్నారు.