జంబో జాయినింగ్స్ కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి
![జంబో జాయినింగ్స్ కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_6482e94edd7bc.jpg)
- మరి కొందరి చేరికకు రంగం సిద్ధం
- ‘హస్తం’ పార్టీలో కీలక పరిణామాం
- మూడు జిల్లాల్లో బలం పెరిగే చాన్స్
- ఖర్గే నుంచి ఆమోదం తీసుకున్న రాష్ట్ర నేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో: చాలా రోజుల తర్వాత కాంగ్రెస్లో జంబో జాయినింగ్స్కు రాష్ట్రం వేదిక కానున్నది. భారీ సభ ద్వారా మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి తమ అనుచరులతో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇంకా పలువురు నేతలకు సైతం కాంగ్రెస్ గాలం వేస్తున్నది. భారీగా అనుచరులు, కొంతమంది లీడర్లతో కాంగ్రెస్లో చేరాలని పొంగులేటి వర్గం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన నేతలను మళ్లి పిలుస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది. ఖమ్మంలో శుక్రవారం ఉదయం ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమనే సంకేతాలిచ్చారు. గతంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా ఆయన అనుచరులు అంతా కాంగ్రెస్లో చేరాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన హస్తం గూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న భారీ సభ ద్వారా ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తున్నది. ఈ సభకు రాహుల్ లేదా ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారు.
రీ ఎంట్రీ
ఇటీవల కాంగ్రెస్ నుంచి కొంతమంది నేతలు బయటకు వెళ్లారు. కానీ, పార్టీలో చేరిన ముఖ్య నేతలు లేరు. కానీ, పొంగులేటి చేరిక కాంగ్రెస్కు జీవం పోసే విధంగా మారుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రాఫ్ పెంచుకుంటున్న కాంగ్రెస్ ఇటు పొంగులేటి, అటు జూపల్లి సహా వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గతంలో తన వర్గంగా ఉన్న కొంతమందిని కాంగ్రెస్కు రావాలంటూ పొంగులేటి, జూపల్లి పిలుస్తున్నారు. వీరితో వచ్చేందుకు పలువురు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస్లో భారీ చేరికలు లేకపోవడం, ఇప్పుడు భారీ స్థాయిలో పొంగులేటి వర్గం చేరుతుండటంతో పార్టీలో జోష్ పెరుగనున్నది.
అధిష్టానం ఆమోదం
కాంగ్రెస్లో వీరి చేరికకు అధిష్టానం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తున్నది. ఇటవల అమెరికా నుంచి వచ్చిన రేవంత్రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్మాణిక్ రావు ఠాక్రేతో కలిసి ఏఐసీసీ పెద్దలకు వివరించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు నేతల చేరికలపై చర్చించినట్లు సమాచారం. పొంగులేటి చేరికపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఆయన కొన్ని నియోజకవర్గల టికెట్లు కూడా అడుగుతుండటంతో.. దానికి ఏఐసీసీ నేతలు ఒప్పుకున్నట్లు తెలుస్తున్నది.
మూడు జిల్లాల్లో బలం
కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి చేరికతో ప్రధానంగా మూడు జిల్లాల్లో బలం పెరుగనున్నది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్లో పార్టీకి అనుకూలత పెరుగనున్నది. ఖమ్మంలో బలంగా ఉన్న కాంగ్రెస్కు.. పొంగులేటి చేరికతో మెజార్టీ నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నట్టే. అంతేకాకుండా ఈ జిల్లాలో బీజేపీకి, బీఆర్ఎస్కు బలం కూడా తక్కువే. వామపక్షాలకు బలం ఉన్నా.. వారిలో కొంతమంది పొంగులేటితో కలిసి వస్తారని తెలుస్తున్నది. ఇప్పుడు బహిరంగంగా బయటకు రాకున్నా.. ఎన్నికల సమయంలో పొంగులేటికి మద్దతు చెప్తారని టాక్. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా పొంగులేటికి అనుచరులున్నాయి. ఇక జూపల్లి రాకతో మహబూబ్నగర్లో బలం పెరుగనున్నది.