క్రెడిట్​ చెల్లింపులపై ఆర్​బీఐ ఆందోళన

క్రెడిట్​ చెల్లింపులపై ఆర్​బీఐ ఆందోళన
  • లైట్​తీసుకుంటున్న బ్యాంకులు
  • కొనుగోళ్ళు ఎక్కువ
  • చెల్లింపులు తక్కువ

ముంబై: దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. బ్యాంకులు సైతం కార్డుల జారీని సులభతరం చేయడం ద్వారా వాటిని వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. చేతిలో కార్డు ఉంది కదా అని తెగ వాడేస్తున్నారు. దీంతో క్రెడిట్ కార్డు బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో గరిష్ఠంగా ఈ మొత్తం రూ. 2 లక్షల కోట్లకు చేరింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఒకప్పుడు ధనవంతుల వద్దే క్రెడిట్ కార్డులు కనిపించేవి. కానీ, ఇప్పుడు అన్ని ఆదాయ వర్గాల వారికీ ఈ కార్డులు చేరువయ్యాయి. బ్యాంకులతో పాటు ఫైనాన్షియల్ సంస్థలు సైతం వాటిని ఈజీగా అందిస్తున్నాయి. దీంతో వాటి వినియోగం గణనీయంగా పెరిగింది. చేతిలో ఒకటికి మించిన కార్డులు ఉంటున్నాయి. దీంతో వాటిని తెగ వాడేస్తున్నారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కానీ, తిరిగి చెల్లించడంలో వెనకబడిపోతున్నారు. దీంతో క్రెడిట్ కార్డు బకాయిలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో క్రెడిట్ కార్డు బకాయిలు కొత్త రికార్డును నమోదు చేశాయి. కార్డుల వినియోగదారులు బ్యాంకులకు చెల్లింపులు చేయాల్సిన మొత్తం తొలిసారి రూ. 2 లక్షల కోట్లు దాటింది. అంటే ఏ స్థాయిలో క్రెడిట్ కార్డులను ఏ విధంగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఏకంగా 30 శాతం మేర వృద్ధి నమోదైంది.

ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ సెక్యూర్డ్ లోన్స్ (ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే రుణాలు) పెరుగుతుండడంపై హెచ్చరికలు చేసింది. బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే, బ్యాంకులు మాత్రం అదేమంత పెద్ద విషయం కాదని చెబుతున్నాయి. క్రెడిట్ కార్డు జారీ చేసేటప్పుడు వినియోగదారుడు క్రెడిట్ హిస్టరీతో పాటు, ఆ వ్యక్తి ఫైనాన్షియల్ హెల్త్‌ను చూసే కార్డును జారీ చేస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. బకాయిలు పెరగడానికి క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం సైతం మరో కారణమని నిపుణులు చెబుతున్నారు.దేశంలో క్రెడిట్ కార్డు వినియోగం పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కవలం 5 శాతం మంది దగ్గరే క్రెడిట్ కార్డులను ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇక బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణాల్లో క్రెడిట్ కార్డు రుణాల వాటా కేవలం 1.4 శాతం మాత్రమేనని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అందులో హోమ్ లోన్ రుమాలు 14.1 శాతం కాగా.. ఆ తర్వాతి స్థానంలో 3.7 శాతం వాటా వాహన రుణాలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.1.3 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. హామీ లేని రుణాలు పెరుగుతున్న క్రమంలో బ్యాంకులను హెచ్చరిస్తోంది ఆర్‌బీఐ. ఈ విషయంలో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అయితే బ్యాంకులు మాత్రం సమస్య లేదని పేర్కొంటున్నాయి.