సుమధుర ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం 

సుమధుర ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం 
  • జన్మభూమికి మంచి చేయాలన్న వారి ఆలోచన అభినందనీయం 
  • కెసిఆర్ హయంలోనే గ్రామాల అభివృద్ధి
  •  దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ  తెలంగాణ రాష్ట్రం
  •  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి లో  స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవ్వాలి
  •  రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ వారు   2 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన గుండా సత్తయ్య  మెమోరియల్ ప్రభుత్వ  పాఠశాల భవనాన్ని  ప్రారంభించిన  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..
  • పాల్గొన్న ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగయ్య..పైల్ల శేఖర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గుండా మధుసూదన్..

ముద్ర యాదాద్రి భువనగిరి : నాలుగు పైసలు సంపాదిస్తే సొంత ఊరును, అయినవారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తాము పుట్టి పెరిగిన సొంత ఊరు కోసం సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, రెండు కోట్ల వ్యయంతో  ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనాన్ని నిర్మించిన సుమధుర ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా రామన్న పేట మండలం ఇస్కిళ్ల గ్రామం లో సుమధుర ఫౌండేషన్ ట్రస్టీ గుండా మధుసూదన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రెండు కోట్ల వ్యయంతో నిర్మించిన ఆత్యాధునిక ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా.. పుట్టిన ఊరు, కన్నతల్లిని మరచిపోకూడదనే పెద్దల మాటలను మధుసూదన్ కుటుంబ సభ్యులు నిజం చేశారన్నారు. కన్నతల్లితో సమానమైన సొంత గ్రామంతో అనుబంధం పేగు బంధం లాంటిదన్న మంత్రి, అలాంటి సొంత ఊరిపై ఉన్న మమకారంతో  ధనార్జనే ముఖ్యం కాదని నిరూపించారని పేర్కొన్నారు.. సొంత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా భావించి సేవా కార్యక్రమాలు చేస్తున్న సుమధుర ఫౌండేషన్ సభ్యులు అందరికీ ఆదర్శం అన్నారు.  సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అంన్నిర్రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లాడిపోయిన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిందన్నారు.

కెసిఆర్ నాయకత్వంలో పట్టణాలకు దీటుగా పల్లెలు సైతం అభివృద్ధిలో పరుగులు పెడుతూన్నాయన్నారు.ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి తోడుగా, మేము సైతం అంటూ సుమధుర ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. పుట్టిన ఊరుకు మంచి చేయాలనే ఆలోచనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ,సామాజిక కార్యక్రమాలు నిర్వహించి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు . కార్యక్రమంలో నకిరేకల్లు శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.