ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్ హాజరవుతుందా? కాదా?
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుపై బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ తో టచ్లో ఉన్న మిత్రపక్షాలన్నీ ఇప్పటికే బహిష్కరిస్తున్నట్లుగా వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకో నాలుగు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న పార్లమెంట్ ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయం ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే.. వేచిచూడాల్సిందే..
పార్లమెంట్ భవనాన్ని ప్రధాని కాకుండా.. ముర్ము ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని , విపక్షాలు తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని అమిత్షా కోరారు. కొత్త పార్లమెంట్ వారసత్వ సంపద అని అన్నారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. స్పీకర్ కుర్చీ వెనుక ఈసారి రాజదండాన్ని పెట్టబోతున్నారు. బ్రిటీష్ వారు దేశ తొలి ప్రధాని నెహ్రూకు అధికారాన్ని అప్పగిస్తూ ఇచ్చిన రాజదండాన్ని కొత్త పార్లమెంట్లో ప్రదర్శిస్తారు.