కాళేశ్వరం కాలువ పనులు పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా
![కాళేశ్వరం కాలువ పనులు పరిశీలించిన కలెక్టర్ రాజర్షిషా](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643e6e4f9922e.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం చిన్నశంకరంపేట్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కాళేశ్వరం కాలువ పనులు పరిశీలించి తహశీల్ధార్ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి తహశీల్ధార్ కార్యాలయంలో మండలానికి సంబంధించి కొన్ని ప్రధాన కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సూరారం, ఎస్.కొండాపూర్, గజగట్లపల్లి ధరణి పాస్ బుక్స్ పంపిణీకి సంబందించిన సమస్యలను రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో తెలుసుకొని వెంటనే పరిష్కరించవలసినదిగా అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖామంత్రి టి.మాందాపూర్ కు సంబంధించి 60 మంది లబ్దిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారని, మిగతా గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి అర్హులైన లబ్దిదారులకు పాసు పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని మూడు గ్రామాలలో ఉన్న సమస్యలపై చర్చించి పరిష్కరించుటకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీచేశారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అందరు అధికారులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిశా నిర్దేశం చేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక్కడ 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించి, త్వరలో మండల స్థాయిలో లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు.
అనంతరం గవ్వలపల్లిలో కాళేశ్వరం కాలువ, కల్వర్టులు, బ్రిడ్జిలు, అండర్ టన్నెల్ మొదలగు నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తు మే చివరి నాటికి పనులు పూర్తయేలా చూడాలని, నిధుల కొరత లేదని ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి రవి ప్రసాద్, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, ఆర్డీఓ. సాయిరాం, తహశీల్ధార్ తదితరులు పాల్గొన్నారు.