ఆ యూనియన్ నాయకుల నుంచి రక్షణ కల్పించండి

ఆ యూనియన్ నాయకుల నుంచి రక్షణ కల్పించండి
  • ఉద్యోగాలు చేసుకోలేము... మాకు ఆత్మహత్యలే శరణ్యం
  • ఉత్తమ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు
  •  విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేసిన వైద్య ఉద్యోగులు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: తాము పనిచేస్తున్న ప్రతిచోట ఉత్తమ వైద్య సేవలు అందిస్తూ అధికారుల మన్ననలు పొందుతున్న మమ్మల్ని యూనియన్ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేకుండా చేస్తున్నారని వైద్య ఉద్యోగులు చావా జ్యోతి, సల్వాది శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మోతే పిహెచ్సి డిఇఓ చావా జ్యోతి  మాట్లాడుతూ తాను బిబి గూడెం నుంచి రాజీవ్ నగర్ పిహెచ్సి కి అక్కడి నుంచి నూతనకల్ డీఈవోగా అధికారుల మన్నన్లతో బాగా పనిచేస్తూ మూడు నెలల్లో 40 డెలివరీలు చేయించినట్లు తెలిపారు. తనను అక్కడి నుంచి మోతే పిహెచ్సి కి బదిలీ చేయగా అక్కడ కూడా బాగానే పనిచేస్తుండగా బుర్కా చర్లకు పంపించారని దీంతో ఏడాదికో మారు తాను బదిలీ అవుతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి గారికి విన్నవించగా ఆయన బుర్కచర్ల బదిలీని ఆపు చేయించారని తెలిపారు. దీంతో  ప్రస్తుతం మోతె పీహెచ్ సి లో డీఈవోగా పనిచేస్తున్న తాను కడుపునొప్పితో బాధపడుతూ ఈ నెల 12న వైద్యాధికారి అనుమతితో ఖమ్మం ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని ఇదిలా ఉండగా యూనియన్ నాయకులు తాను విధులకు హాజరు కావడం లేదంటూ పత్రికల్లో వార్తలు రాయించడం తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందన్నారు.

ఉత్తమ ఏఎన్ఎమ్ గా రెండుమార్లు అవార్డులు అందుకున్న తనకు యూనియన్ నాయకుల నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అలాగే మోతే సిహెచ్ఓ గా పనిచేస్తున్న సల్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ తాను నూతనకల్ పీహెచ్ సి గెజిటెడ్ ఆఫీసర్గా మంత్రులు, కలెక్టర్ ఆదేశాలతో అద్భుతంగా పనిచేసే డెలివరీలు పెంచినట్లు తెలిపారు. అలాంటి తనపై యూనియన్ నాయకులు ఉద్దేశపూర్వకంగా యూనియన్ లెటర్ ప్యాడ్ పై తాను మహిళా ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఒక మగ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో డి డబ్ల్యూఓను విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. డి డబ్ల్యు ఎలాంటి విచారణకు రాకుండా కలెక్టర్కు నివేదిక ఇచ్చారని ప్రస్తుతం తాను మోతేలో పనిచేస్తుండగా మరల విచారణ విషయాన్ని బయటకు తెచ్చారని ఆరోపించారు.

మోతేలో మరో ఆరోగ్య కార్యకర్త పదిమంది ఏఎన్ఎంల ఫోర్జరీ సంతకాలతో ఫిర్యాదు చేయగా డిప్యూటీ డిఎంహెచ్ఓ విచారణ చేయగా ఏఎన్ఎంలు తమను ఎలాంటి ఇబ్బందులకు పెట్టలేదని దొంగ సంతాకాలతో ఫిర్యాదు చేసినట్లు విచారణలో తేల్చి చెప్పారన్నారు. ఈ నెల 12న మెడికల్ ఆసుపత్రి డాక్టర్ అనుమతితో తన భార్య జ్యోతి కి కడుపునొప్పి రావడంతో ఖమ్మం ఆసుపత్రికి వెళ్ళామని తెలిపారు. యూనియన్ నాయకుల మాటలు నమ్మి తమను ఇబ్బందుల పాలు చేయడం తగదని అన్నారు. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ,  మానవ హక్కుల కమిషన్, డీఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వో లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూనియన్ నాయకుల నుంచి మాకు రక్షణ కల్పించాలని ఆత్మహత్య మాకు శరణ్యమని తమకు ఉద్యోగాలు తప్ప వేరే వ్యాపకాలు లేవని మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకొనివ్వాలని ఉన్నతాధికారులను కోరారు.