ప్రభుత్వ ఆస్పత్రుల్లో  డెలివరీల రికార్డ్​

ప్రభుత్వ ఆస్పత్రుల్లో  డెలివరీల రికార్డ్​
  • గత నెలలో 76.3 శాతం జరిగిన ప్రసవాలు
  • ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగింది
  • ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు 


ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత నెల రోజుల్లో 76.3 శాతం ప్రసవాలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో మంగళవారం మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధికంగా నారాయణ్ పేటలో 89 శాతం, ములుగు 87 శాతం, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84శాతం, వికారాబాద్ 83, గద్వాల్ 85 శాతం డెలివరీలు జరిగాయన్నారు. అతి తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు అవుతున్న మంచిర్యాల(63), నిర్మల్(66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ స్కోర్ విషయంలో మొదటి స్థానాల్లో నిలిచిన మెదక్(84.4), జోగులాంబ గద్వాల్(83.9), వికారాబాద్(81), ములుగు(79), నాగర్ కర్నూల్(77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానంలో ఉన్న జగిత్యాల, కుమ్రంభీం, నారాయణ్ పేట్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. 

ఆశాలు, ఏఎన్ఎంల కృషి అభినందనీయం..

క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రాథమిక స్థాయి వైద్యం అందిస్తూ, ప్రజలను రోగాలబారి నుంచి కాపాడటంలో పీహెచ్​సీ మెడికల్ ఆఫీసర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. రోగాన్ని ముందుగా గుర్తించి, చికిత్స అందించడం ద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడుతున్నట్లు చెప్పారు. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, రూపాయి ఖర్చు భారం వారిపై పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్ఎంలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆశా, ఏఎన్ఎంల సేవలు గుర్తించిన సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక వేతనాలును అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క గర్భిణి కూడా పరీక్షల కోసం ప్రైవేటుకు వెళ్లొద్దనే ఉద్దేశంతో టిఫా సహా అన్ని రకాల పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.  

వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయుల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్బిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పాముకాటు, కుక్కకాటు మందులను అన్ని పీహెచ్​సీల్లో అందుబాటులో ఉంచామని, ఎక్కడా లేవు అనే మాట రావొద్దన్నారు. సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు, అన్ని జిల్లాల డీఎంహెచ్​ఓలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.