నా ఇంటి గేటు 24 గంటలు తెరిచే ఉంటుంది

నా ఇంటి గేటు 24 గంటలు తెరిచే ఉంటుంది
  • మీ కళ్ళ ముందు బిడ్డను కాపాడుకోండి
  • మాయల మరాఠి బండి 
  • నా సెంటిమెంట్ గ్రామం బావుపేట
  • హైదరాబాద్ లో వాటా కోసం ఆంధ్రోళ్ల కుట్రలు
  • బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా మా ఇంటి గేటు 24 గంటలు తెరిచే ఉంటుందని, నా ఫోన్ ఎల్లప్పుడూ మీ కోసమే అందుబాటులో ఉంటుందని బీ ఆర్ ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి మండలం బావుపెట గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు కోలాటం నృత్యాలు చేస్తూ మహిళలు స్వాగతం పలికారు. మంత్రి గంగుల ఇంటింటా తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పే మాయల మరాఠీ బండి సంజయ్ అని, హిందువుల పేరు చెప్పుకొని కాలం గడపడం తప్ప చేసిందేమీ లేదన్నారు. 

ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నర ఏళ్లుగా పత్తా లేకుండా పోయిన సంజయ్ ఒక్క గ్రామానికి రూపాయి నిధులు తెచ్చింది లేదని అన్నారు. తాను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఎల్లప్పడూ మీ కళ్ళ ముందు కనిపించే బిడ్డను నేనని నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే నని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కోట్ల రూపాయల నిధులతో పల్లెల రూపురేఖలు మార్చామని ఈ అభివృద్ధి ని కొనసాగించాలని కోరారు. హైదరాబాద్ సంపదలో వాటా కోసం ఆంధ్రోళ్ల కన్ను పడిందని, బీజేపీ కాంగ్రెస్ రూపంలో ఆంధ్రోళ్లు ఒక్కటయ్యారు అని వాళ్ళ మాయమాటలు నమ్మితే మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని అన్నారు. తనకు బావుపెట్, ఆసిఫ్ నగర్ గ్రామం సెంటిమెంట్ అని కష్టకాలం లో ఆదుకున్న గ్రామం ఇది అని తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.