రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం..
![రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం..](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d36589d4bff.jpg)
- టీపీసీసీ సభ్యుడు గండ్ర సత్యనారాయణరావు..
- భూపాలపల్లిలో యువజన కాంగ్రెస్ నాయకుల భారీ బైక్ ర్యాలీ..
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:త్వరలో జరగబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకుల పాత్ర కీలకమని టీపీసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాలను అందరికీ చేరవేసేలా యువత ముందుండాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ను ఎవరు మరువకూడదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి యువజన కాంగ్రెస్ నాయకులు సైనికుల్లా పనిచేయాలని ఆయన సూచించారు. అంతకు ముందు భూపాలపల్లి పట్టణంలోని 5 ఇంక్లైన్ కమాన్ నుండి ప్రొఫెసర్ జయశంకర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జంక్షన్ల మీదుగా హనుమాన్ టెంపుల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ మధ్యలో ప్రొఫెసర్ జయశంకర్, అంబేద్కర్, ఇందిరా గాంధీ విగ్రహాలకు గండ్ర సత్యనారాయణ రావు పూలమాలలు వేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, వివిధ మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.