ఈరోజు సాయంత్రం గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళులు…

ఈరోజు సాయంత్రం గన్ పార్క్ వద్ద కేసీఆర్ నివాళులు…
  • మూడు రోజుల పాటు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న బీఆర్ఎస్
  • నేడు గ‌న్ పార్క్ నుంచి స‌చివాల‌యం వ‌ర‌కు క్యాండిల్ ర్యాలీ
  • రేపు తెలంగాణ భవ‌న్ లో ప్ర‌త్య‌క స‌మావేశాలు

ముద్ర,తెలంగాణ:- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి వరకు తెలంగాణ వాదులు, ప్రజలు నేటి సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంటనగరాల పార్టీ శ్రేణులతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

తెలంగాణ భ‌వ‌న్లో ఆవిర్భావ వేడుక‌లు….

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులు, అనాథ శరణాలయాల్లో ప్రజలకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు.