కేసీఆర్ను ఈజీగా ఓడిస్తాం
![కేసీఆర్ను ఈజీగా ఓడిస్తాం](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64a25aae138ba.jpg)
- రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తాం
- బీజేపీ బంధువుల సమితిగా బీఆర్ఎస్
- ఆ పార్టీ బీజేపీకి బీ టీంగా మారింది
- కేసీఆర్..మోడీ చేతిలో ఓ రిమోట్ కంట్రోల్
- అందుకే రైతు వ్యతిరేక బిల్లుకు మద్దతు ఇచ్చారు
- తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్యే పోటీ
- అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.4వేల పింఛన్
- ఖమ్మం జనగర్జన సభలో కాంగ్రెస్అగ్రనేత రాహుల్గాంధీ
- కండువా కప్పి పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్
- శాలువా కప్పి భట్టి విక్రమార్కకు సన్మానం
బీఆర్ఎస్అంటే బీజేపీ బంధువుల సమితి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్కు మధ్యే పోటీ ఉంటుంది. ప్రధాని మోడీ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్సమర్థిస్తున్నారు. ప్రధాని చేతిలో కేసీఆర్ రిమోట్లా మారారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్డిక్లరేషన్ప్రకటించామని, ఖమ్మం వేదికగా కాంగ్రెస్చేయూత పేరుతో వృద్ధులు, వితంతువులకు ప్రతీనెల రూ.4వేల పింఛన్ఇస్తామని తెలిపారు. అంతకుముందు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కండువా కప్పి కాంగ్రెస్పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పాదయాత్రముగింపు సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.
కాళేశ్వరంలో లక్షకోట్ల అవినీతి..
తెలంగాణలో సీఎం కేసీఆర్అవినీతి పాలనకు తెరలేపారని రాహుల్విమర్శించారు. కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ధరణి పోర్టల్ పేరిట పేదల భూములు లాక్కుందని ఆరోపించారు. మిషన్కాకతీయలో భారీ అవినీతికి పాల్పడ్డారని, రైతులు, దళితులు, ఆదివాసీలు, యువకులు, సమాజంలో అన్నివర్గాలను కేసీఆర్దోచుకున్నారని రాహుల్ధ్వజమెత్తారు. అవినీతి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నివర్గాలను కోరారు.
తెలంగాణకు రాజుగా.. సంపదను జాగీరుగా భావిస్తున్నారు
సీఎం కేసీఆర్తనకు తాను తెలంగాణకు రాజుగా.. రాష్ట్ర సంపదను తన జాగీరుగా భావిస్తున్నారని రాహుల్గాంధీ విమర్శించారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన అన్నివర్గాల ప్రజల కలలను ధ్వంసం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఒకటి ఊహిస్తే.. బీఆర్ఎస్మరొకటి చేసిందని, ఈ తొమ్మిదేళ్లలో టీఆర్ఎస్పేరు బీఆర్ఎస్గా మారడం తప్ప తెలంగాణలో కేసీఆర్చేసిన మంచి పనులేవీ లేవన్నారు. పేదలు, దళితులకు నాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్తిరిగి లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే ఆ భూములు మళ్లీ వారికే పంచుతామని రాహుల్గాంధీ అన్నారు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించే అన్ని హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్అగ్రనేత రాహుల్గాంధీ తెలిపారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీ టీం అయిన బీఆర్ఎస్కు.. కాంగ్రెస్ కు మధ్యే పోటీ నెలకొందన్నారు. రైతు బిల్లు విషయంలో పార్లమెంట్లో బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్నిలబడితే.. బీజేపీకి బీ టీంగా వ్యవహరించిన బీఆర్ఎస్ఆ బిల్లుకు మద్దతు తెలిపిందన్నారు. తెలంగాణలో కేసీఆర్అవినీతి, లిక్కర్స్కాం గురించి సెంట్రల్ఏజెన్సీలకు తెలుసని చెప్పిన రాహుల్.. బీఆర్ఎస్ బీజేపీకి బీం కావడంతో నే ఎలాంటి చర్యలు లేవన్నారు. పాట్నా జరిగిన విపక్షాల సమావేశానికి బీఆర్ ఎస్ను ఆహ్వానించాలని చెబితే తాము ఒప్పుకోలేదన్న రాహుల్గాంధీ.. ఒకవేళ బీఆర్ఎస్వస్తే కాంగ్రెస్హాజరు కాదని తేల్చిచెప్పామన్నారు.
బీఆర్ఎస్తో పొత్తు ఉండబోదు..
బీఆర్ఎస్తో కాంగ్రెస్కు ఎలాంటి పొత్తు ఉండబోదన్న రాహుల్గాంధీ.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని సునాయాసంగా ఓడిస్తామన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ పాదయాత్రముగింపు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అయన అనుచరులు పార్టీలో చేరిక సందర్భంగా ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్జనగర్జన సభలో రాహుల్గాంధీ పాల్గొన్నారు. పోడు సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామని అన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్.. హెలిక్యాప్టర్లో ఖమ్మంకు చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సుమారు 22 నిమిషాల పాటు రాహుల్గాంధీ ప్రసంగించారు. ఆయన వెంట కాంగ్రెస్వ్యవహారాల ఇన్చార్జి మానిక్రావ్ఠాక్రే, టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
కర్ణాటక ఫలితాలు పునరావృతమవుతాయి..
కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలోనూ పునరావృత్తమవుతాయని రాహుల్గాంధీ అన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ఓడించింది. ఈ గెలుపులో అక్కడి అన్నివర్గాలు కాంగ్రెస్కు అండగా నిలిచాయి. అక్కడి అవినీతి ప్రభుత్వం, పెట్టుబడిదారులు ఓవైపు బడుగు బలహీనవర్గాలు, రైతులు, దళితులు మరోవైపు మధ్య జరిగిన పోరులో బడుగు బలహీనవర్గాలు, రైతులే గెలుపుబావుటా ఎగురవేశారన్నారు తెలంగాణలోనూ ఇదే జరగబోతుందని పేర్కొన్నారు.
ఘర్వాపసీ..
2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మంది నేతలు కాంగ్రెస్ ను వీడారు. ఇప్పడు వారందరూ తిరిగి పార్టీలో చేరాలని కోరుతున్నా. కాంగ్రెస్ లో చేరేవారి కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. బీజేపీ, బీఆర్ఎస్ఆలోచనా విధానాలు ఉన్నవాళ్లకు కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధం లేదు. కార్యకర్తలే నా వెన్నెముక. వారు కష్టకాలంలో కాంగ్రెస్ను వదల్లేదని, బీఆర్ఎస్నేతలు ఎన్నిదాడులు చేసిన ఓర్చుకున్నారని అన్నారు.
నా యాత్రకు స్పూర్తినిచ్చారు..!
భారత్జోడో యాత్రను దేశవ్యాప్తంగా అందరూ సమర్థించారు. తెలంగాణలోనూ నా యాత్ర కొనసాగింది. మీరందరూ మద్దతు తెలిపి నా యాత్రకు స్ఫూర్తినిచ్చారు. ఇక్కడి సమస్యలు నాకు వివరించి.. నన్ను మీ వాడిలా భావించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్కు కంచుకోట. మీ మనసులో కాంగ్రెస్పదిలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్అధికారంలోకి రాబోతుంది. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో రాష్ర్టంలో అన్నివర్గాల సమస్యలు మా దృష్టికి వచ్చాయి. వాటిని కచ్చితంగా పరిష్కరిస్తామని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.