ఆపత్కాలంలో సిపిఆర్ కీలకం - జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్
![ఆపత్కాలంలో సిపిఆర్ కీలకం - జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_6448eb1bb3d50.jpg)
ముద్ర ప్రతినిధి, నిర్మల్: అత్యవసర సమయంలో మనము అందించే సిపిఆర్ ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించిన అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని నిర్మల్ ఎస్పీ సిహెచ్.ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గుండెపోటు వచ్చినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సపై పోలీస్ అధికారులకు అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు.
సందర్భంగా ఎస్పీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గుండె పోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాదవచ్చని, సిపిఆర్ పై అవగాహన ఉండడం ద్వారా సకాలంలో స్పందించి సిపిఆర్ తో విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ, వాహనం వచ్చే పది నిముషాల వరకు సిపిఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్నీ, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని అన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ మాట్లాడుతూ ఎప్పుడైనా ప్రమాదానికి గురైనపుడు,హార్ట్ ఎటాక్ గురైన వారికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సదరు వ్యక్తికి మనం ఇచ్చే ధైర్యం ముఖ్యమని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు మరియు 108 సిబ్బంది హార్ట్ ఎటాక్ వచ్చిన సమయంలో ఎలాంటి చికిత్స అందించి క్షతగాత్రులను కాపాడాలో తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (ఎఆర్)ధనరాజ్, ఎఓ వెంకట శేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఅర్బి ఇన్స్పెక్టర్ అజయ్ బాబు, డాక్టర్లు సమత,శ్రీనివాస్, రాజేందర్, ఆర్ ఐ రామకృష్ణ, యం.టి.ఓ వినోద్, ఆర్ఎస్ఐ, కార్యాలయ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.