సర్కార్ దవాఖానలపై  ప్రజలకు పెరిగిన నమ్మకం

సర్కార్ దవాఖానలపై  ప్రజలకు పెరిగిన నమ్మకం

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి-మెదక్ ఎంసిహెచ్ లో మనవడికి టీకా
ముద్ర ప్రతినిధి, మెదక్: సర్కార్ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం  మెదక్ లోని మాత, శిశు ఆసుపత్రిలో తన మనవడికి టీకా ఇప్పించారు. సమీపంలో పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో నూతనంగా 65 లక్షల వ్యయంతో నిర్మించిన నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలకు నిలయంగా ఉండేవన్నారు. దాంతో ప్రజలు ఆ ఆసుపత్రులకు వచ్చేందుకు జంకే వారని గుర్తు చేశారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారని  తెలిపారు. ఆసుపత్రుల స్థాయి పెంచడంతో పాటు కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. డాక్టర్, స్టాఫ్ పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా అన్ని హంగులతో మాత, శిశు సంరక్షణ కేంద్రలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రైవేట్  ఆసుపత్రులకు ధీటుగా ఉన్న ఎంసిహెచ్ లకు ఆదరణ బాగా పెరిగిందని, మెరుగైన వైద్య సేవలతో పాటు కేసీఆర్ కిట్, 12,000 నగదు సాయం అందిస్తుండటం వల్ల వీటిలో  ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్ రావ్ బాధ్యతలు తీసుకున్న తరువాత మెదక్ జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు మెరుగు పరచడం పై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ఐసీయూ, డయాలసిస్ సెంటర్, డయాగ్నోసిస్ హబ్, ఆక్సిజన్ ప్లాంట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, అన్ని రకాల చికిత్సలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వుని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డాక్టర్ శివ దయాల్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ జానకిరామ్ సాగర్, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.