సమీకృతం.. ప్రారంభానికి సిద్ధం

సమీకృతం.. ప్రారంభానికి సిద్ధం
  • జిల్లా కలెక్టర్ తో కలిసి సందర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి 
  • ప్రజల సౌకర్యార్థం మార్కెట్  భవనం  నలుమాలల సెంట్రల్  కూలింగ్ సిస్టం ఎర్పాటు చేయాలని ఆదేశం 
  • సమీకృత భవనం లో కలియు తిరిగిన మంత్రి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సమీకృత మార్కెట్‌ నిర్మాణం పూర్తయ్యింది. సూర్యాపేట  శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో సూర్యాపేట  పట్ణణంలో రూ.30కోట్లతో నిర్మించారు. ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. సిఎం  కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

పట్టణ నడిబొడ్డున నిర్మాణం : సూర్యాపేట పట్టణం మధ్యలో, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం చేపట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో రైతులు, వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ కూరగాయలు అమ్ముకునేవారు. వర్షకాలమైతే పరిస్థితి వర్ణనాతీతం. ఆ ప్రాంతమంతా బురదమయమయ్యేది. పందులు స్వైరవిహారం చేసేవి. ఈ క్రమంలో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని గుర్తించిన మంత్రి జగదీష్  రెడ్డి పట్టణంలోని ఆయా వార్డుల్లో పర్యటించిన సందర్భంగా మార్కెట్‌ పరిస్థితిని గమనించారు. నిధులు మంజూరు చేయించి కూరగాయాలు, మాంసం, చికెన్‌ తదితరవి అన్నీ ఒకే చోట లభించేలా ఈ సమీకృత మార్కెట్‌ను నిర్మించారు. ఈ మార్కెట్‌తో కూరగాయలు అమ్ముకునే రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులకు ఎండాకాలం, వానకాలంలో కలిగే ఇబ్బందులు తప్పినట్లయింది.

మార్కెట్ భవనం లో నలువైపులా సెంట్రల్ కూలింగ్ సిస్టం

మార్కెట్ మొత్తం సమీకృత భవనం లోపలే ఉండటం తో సరుకుల కొనుగోలు కు వచ్చే ప్రజల  సౌకర్యార్థం భవనం నలువైపులా  సెంట్రల్ కూలింగ్ సిస్టం ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ మేరకు జిల్లా  కలెక్టర్ వెంకట్రావ్, మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తో కలసి మార్కెట్ భవాన్నాన్ని సందర్షించిన మంత్రి,ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కూలింగ్ సిస్టం ను సందర్శించి పలు సూచనలు చేశారు. మార్కెట్ లో ఎర్పాటు చేసే టేబుల్స్  నాణ్యత ను పరిశీలించిన మంత్రి,మార్కేట్ ప్రారంభం నాటికి సెంట్రల్ కూలింగ్ సిస్టం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.