స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యేదెన్నడు?
![స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యేదెన్నడు?](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_647d971c8a2fc.jpg)
- మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్ఆదేశాలు పట్టని అధికారులు
- వ్యాపారాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుఖాణదారులు
ముద్ర, ముషీరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవ్గంలో ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ మీదుగా వీఎస్టీ వరకు ఏర్పాటు చేస్తున్న స్టీల్బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని పులమార్లు స్థానికులు సంబంధిత అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసినప్పటికీ పనుల్లో వేగం పుజుకోకపోవడంతో స్థానికులు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్టీల్ బ్రిడ్జి నిర్మాన పనుల్లో వేగం పెంచాలని స్థానిక కార్పొరేటర్ సైతం పలువురు ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్ళారు. కానీ పనులు వేగవంతం చేయడంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టినట్లు కనిపించలేదు. దీంతో స్థాకికులు, వాహనదారులు, వాయపారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శులు వెల్లువెత్తాయి.
విషయం తెలుసుకున్న రాష్ట్ర మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్ మార్చి నాలుగో తేదీన స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ అధికారులతో కలసి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులను రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజు నుంచి అశోక్నగర్ చౌరస్తా వద్ద, ఆర్టీసీ క్రస్రోడ్స్ వద్ద బ్యారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను దారిమళ్ళించారు. అదే విధంగా ఇందిరాపార్కు వద్ద కూడా ట్రఫిక్ను ఎన్టీఆర్ స్టేడియంలో నుంచి ప్రత్యామ్నాయ దారులకు మళ్ళించారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. కానీ మంత్రి ఆదేశాల ప్రకారం మే 31తో రెండు నెలల గడువు పూర్తయినప్పటికీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలేదు. ఇందిరాపార్కు చౌరస్తా వద్ద, విఎస్టీ వద్ద అప్పర్, డౌన్ ర్యాంప్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్నగర్ చౌరస్తాలో, ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పనులు రోజురోజుకూ మరింత ఆలస్యం అవుతుండటంతో స్థానికులు, వాహనదారులు, పాదచారులు ప్రత్యామ్నాయ దారులలో వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గిరాకులు పూర్తిగా దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నడక దారులు, యూటర్న్లు, పార్కింగ్ఏర్పాటు చేయాలి
ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాక ఇబ్బందులను ఎదుర్కొన్న స్థానికులు, వ్యాపారులు, పాదచారులు కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక ముందే బ్రిడ్జిక్రింద పిల్లర్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో గ్రిల్స్ఏర్పాటు పనులు చేపట్టారు. గ్రిల్స్ ఏర్పాటు చేస్తే రోడ్డుకు అటూ ఇటూ నడిదేందుకు వీలు లేకుండా పోతుందని, పాదచారులు నడిచేందుకు వీలుగా నడక దారులు వదలాలని, అదే విధంగా వాహనదారులకోసం యూటర్న్లు ఏర్పాటు చేయాలని, అక్కడక్కడా పిల్లర్ల మధ్యన పార్కింగ్కోసం స్థలాన్ని వదలాలని స్థానికులు, వ్యాపారులు, వాహనదారుల నుంచి పలు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. అధికారులు స్పందించక పోవడంతో అశోక్నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్ వరకు షాపులు మూసి వేసి దుఖాణదారులు, స్థానికులు ఒక రోజు ఆందోళన చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ ఏనుగు పావని వీరి ఆందోళనకు మద్దతు పలకడంతో పాటు పలువురు ఉన్నతాధికారులకు సమస్యను వివరిస్తూ విజ్ఞప్తులు సమర్పించారు. ఎట్టకేలకు ప్పందించిన అధికారులు బ్రిడ్జి క్రింద నడక దారులు, యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ పార్కింగ్ విషయంలో మాత్రం ట్రాఫిక్ అధికారులు నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.
స్వయంగా రాష్ట్ర మునిపల్ శాఖామాత్యులు కెటీఆర్ ఆదేశాలతో స్టీల్బ్రిడ్జి నిర్మాణ పనులు జాప్యం లేకుండా పూర్తవుతాయని సంతోషించిన స్థానికులకు, వ్యాపారులకు, వాహనదారులకు మళ్ళీ నిరాశే ఎదురయ్యింది. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా రెండు నెలల్లో పనులు పూర్తి చేయని అధికారులు షెడ్యూల్లోపే పనులు పూర్తవుతాయని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్టీల్బ్రిడ్జి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యేలా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, వాహనదారులు కోరుకుంటున్నారు.