కాషాయమయమైన నిర్మల్

కాషాయమయమైన నిర్మల్

భారీ బైక్ ర్యాలీతోమహేష్ రెడ్డికి ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి నిర్మల్ ప్రజానీకం సోమవారం సాయంత్రం ఘన స్వాగతం పలికారు.  ఇటీవల బిజెపి లో చేరిన అనంతరం తొలిసారిగా తన స్వస్థలానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ శ్రేణులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు నిర్మల్ జిల్లా సరిహద్దు సోన్ నుండి భారీ బైక్ ర్యాలీతో ఊరేగింపు నిర్వహించి స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో స్థానిక సెయింట్ థామస్ పాఠశాల వద్ద జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు చేరటంతో రెండు కిలోమీటర్ల పొడవైన బైక్ ర్యాలీ నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్, వివేకానంద చౌక్ లతో పాటు పలు ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎటు చూసినా కాషాయ జండాలు, ద్విచక్రవాహనాలతో వీధులు నిండి పోయాయి.

ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగింది. ఇదిలా ఉండగా ఇటీవలి వరకు భారాస తో పోలిస్తే బలహీనంగా ఉన్న బిజెపి లో మహేశ్వర్ రెడ్డి చేరిక తో నూతనోత్సాహం నిండింది.