రామాలయం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
![రామాలయం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_643c0e8f8e0f4.jpg)
తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమశాస్త్ర సలహాదారు బ్రహ్మశ్రీ ఆచార్య విష్ణు భట్టాచార్యులు
పెద్ద శంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేట పట్టణంలో చారిత్రాత్మకమైన అత్యంత పురాతన శ్రీ రామాలయం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమశాస్త్ర సలహాదారులు బ్రహ్మశ్రీ ఆచార్య విష్ణు భట్టాచార్యులు అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేటలోని రామాలయంలో సీతారాములను దర్శించుకొని ఆలయ పరిసర ప్రాంతాలను పునర్నిర్మాణం కోసం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన గ్రామ పెద్దల, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 స్తంభాలతో ముఖద్వారా మండపాన్ని నిర్మించడంతో పాటు తూర్పు వైపున భవ్యమైన రామాలయాన్ని నిర్మించుకోవాలన్నారు. 9 అడుగుల మేర గర్భాలయం దక్షిణ ముఖంలో ఆంజనేయ స్వామి విగ్రహం, ఆలయం ఎదురుగా ధ్వజస్తంభం, ఆగ్నేయంలో రథ మండపం, యాగశాల, వంటశాల, నైరుతిలో కార్యాలయాలను నిర్మించుకోవాలన్నారు.
గర్భాలయాన్ని తొమ్మిది అడుగులతో నిర్మించడంతో పాటు ఆలయ గోపురం శిఖరం శోభాయమానంగా నిర్మించాలన్నారు. ఆలయానికి మూడు వైపులా 15 అడుగులు స్థలాన్ని వదిలేసి మధ్యలో గర్భాలయం 9 అడుగులతో నిర్మించడంతోపాటు ఉత్తరంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 20 లోపు బాలాలయం ఈశాన్యం లో నిర్మించి ఆలయ ఆవరణలో స్వామి వారి విగ్రహాలను ఉంచి ప్రతిరోజు నిత్య పూజలు చేయాలన్నారు. సంవత్సరం లోపు భవ్యమైన రామాలయాన్ని పూర్తిచేసి ఉత్తరాయన కాలంలో ప్రారంభించి శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని నూతన రామాలయంలో యధావిధిగా జరిగేలా ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలని అన్నారు. భక్తులకు సీతారాముల చరిత్రను రామాయణ ఘాతను వశిష్ట విశ్వామిత్ర మహర్షిల చరిత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మురళి పంతులు, ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ గౌడ్, సుభాష్ గౌడ్, కందుకూరి రవీందర్, దాదిగారి గంగాధర్, రాగం సిద్దు, కృష్ణారెడ్డి, ఆర్యన్ సంతోష్ కుమార్, జంగం రాఘవులు, పున్నయ్య, మల్లేశం, జస్వంత్, చంద్రశేఖర్, సంతోష్ కుమార్, సర్వేశ్వర్. ఫణి కుమార్ ఆలయ పూజారులు రాయల కృష్ణ శర్మ, నాగరాజు, రామన్న పంతులు, సంతోష్ కుమార్, తదితరులు అధిక సంఖ్యలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.