ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి -  జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, బి.ఎల్.ఓ లు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.  గురువారం మెదక్ మున్సిపల్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులచే  బూత్ స్థాయి అధికారులు, ఫోటో ఎలక్టోరల్ రోల్ స్పెషల్ సమ్మరి రివిజన్-2023పై శిక్షణ, అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్ రోల్ చక్కగా   తయారు చేయాలన్నారు.  పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు. 

ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఒక బూత్ లో   1500 కన్నా ఎక్కువ ఓటర్లు వున్నా , 2 కిలోమీటర్ల దూరం లో పోలింగ్ స్టేషనలు ఉన్నా కొత్త  పోలింగ్ స్టేషన్ అనుమతి కోసం ఈసిఐకు ప్రతిపాదనలు  పంపి  అనుమతి తీసుకుంటామని   తెలిపారు. చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా  నుండి వివరాలను కచ్చితంగా తొలగించాలన్నారు.   బి.ఎల్.ఓ, సూపర్ వైజర్లు  పరిసీలించి అసలైన ఓటరు పేర్లు తొలగిపోకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనాధలు, ఒంటరి, కూలీ కొసం ఊరురూ తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్దుల కొరకు ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు. బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేసిన   ఫామ్-6, ఫామ్- 7, ఫామ్- 8లను ఆర్డిఓ కార్యాలయంలో  పరిశీలించి  తగు చూచనలు చేశారు ఈ కార్యక్రమంలో  ఆర్డి ఓ అంబాదాస్ రాజేశ్వర్, మెదక్  తహశీల్దార్ శ్రీనివాస్,  బిఎల్ఓలు, సూపర్ వైజర్లు, బి.ఎల్. ఓలు తదితరులు పాల్గొన్నారు.