దేశ యువతకు  రాజీవ్​గాంధీ స్ఫూర్తి

దేశ యువతకు  రాజీవ్​గాంధీ స్ఫూర్తి
  • ఆయన కృషితోనే ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి
  • 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్​దే!
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు. 

  • దేశ యువతకు రాజీవ్ స్ఫూర్తి..

రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారని, దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారని అన్నారు.  ఐటీ రంగంతోపాటు  టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు రాజీవ్ గాంధీ చేర్చారన్నారు. దేశంలో యువకులకు రాజీవ్ స్ఫూర్తినిచ్చారని, దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం రాజీవ్ గాంధీ కుటుంబం ప్రాణాలను అర్పించిందన్నారు. రాజీవ్ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

  • బీజేపీ అంటే బ్రిటిష్​జనతా పార్టీ..

రాజీవ్ స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదామని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. దేశంలో బీజేపీ విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తోందని విమర్శించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు. మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.  బీజేపీ, బీఆర్ఎస్  నాణేనికి బొమ్మా, బొరుసులాంటివని, వారిద్దరిది ఫెవికాల్ బంధమని మరోసారి స్పష్టం చేశారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే,  కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.