మీడియా కమిషన్ ఏర్పాటుపై దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది !

మీడియా కమిషన్ ఏర్పాటుపై దేశంలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది !

కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి: నిత్యానంద రాయ్!

పట్నా, ఆగస్ట్ 26: మీడియా కమిషన్ ఏర్పాటు గురించి దేశంలో  పెద్దఎత్తున చర్చ జరగాల్సిన అవసరం  ఉందని , దానిపై జర్నలిస్టు సంఘాల నేతలతో చర్చించడానికి తాను సుముఖంగా  ఉన్నానని , అవసరమైతే అలాంటి చర్చకోసం ఎక్కడికైనా రావడానికి తాను సిద్ధమేనని కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. పట్నా లో జరుగుతున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల రెండోరోజు ఉదయ కార్యక్రమంలో నిత్యానంద రాయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివారం హోటల్ నిర్వాణ లో జరిగిన సమావేశానికి యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలను హోమ్ శాఖ సహాయమంత్రి కి వివరించారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్ , వెబ్ , సోషల్ మీడియాల విస్తరణ నేపథ్యంలో మీడియా రంగ స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో మీడియా lరంగ స్థితిగతులను అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల భద్రత కోసం ఒక చట్టాన్ని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పరిశ్రమల కార్మికులకు, ప్రభుత్వ సిబ్బందికి రెండుసార్లు  వేతనాలు పెరిగినా  , పత్రికా రంగంలో గత పదిహేనేళ్ళుగా వేతనాలు పెరగలేదని శ్రీనివాసరెడ్డి వివరించారు.

కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందిస్తూ జర్నలిస్టుల పనిపరిస్తితులు, వేతనాలు ,భద్రత వంటి అంశాలను పరిష్కరించడానికి జర్నలిస్టు సంఘాలతో తాము  సమన్వయంతో  పనిచేస్తామని అన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఐజేయూ కోరిక సమంజసమేనని, దానిపై చర్చించడానికి తాను సుముఖంగా ఉన్నానని, అయితే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతస్థాయిలోనేననీ ఆయన అన్నారు. మీడియా కమిషన్ గురించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తాను తీసుకు వెళ్తానని నిత్యానంద రాయ్ హామీ ఇచ్చారు. కేవలం పాత్రికేయం మాత్రమే చేసేవారిపై దేశద్రోహం కేసులు పెట్టడానికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలలో ఎక్కడైనా  అలాంటి ఘటనలు జరిగినట్లయితే తాను సైతం జర్నలిస్టు సంఘాలతో కలిసి నిలబడటానికి సిద్ధమేనని అన్నారు. అత్యధిక శాతం పాత్రికేయులు బాధ్యతగా , సత్యంకోసం నిలబడి ఉంటారని , కానీ లక్షమందిలో ఒకరు దేశానికి వ్యతిరేకంగా వుంటే వారి కోసం ఒక చట్టం ఉండాల్సిన అవసరం ఉంటుందని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్యం లో నాలుగో స్తంభంగా పనిచేస్తున్న మీడియాకు చట్టాన్ని మించిన శక్తి ఉందన్నారు.

కలం ఉండాలి, చట్టమూ ఉండాలి , ఎవరిపనులు వారు చేసుకున్నా దేశం విషయంలో అందరి స్వరం ఒకటిగా ఉండాలని నిత్యానంద రాయ్ అన్నారు. ఐజేయు రెండోరోజు సమావేశాల్లో పద్దెనిమిది రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తమ తమ రాష్ట్రాలలో పాత్రికేయులు ఎదుర్కుంటున్న సమస్యలు , వాటి పరిష్కారం కోసం యూనియన్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. నియన్ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ మాట్లాడుతూ ఐజేయును  పటిష్టం చేయడానికి జరుగుతున్న ప్రయత్నం ఫలిస్తొందని ,త్వరలో మరికొన్ని రాష్ట్రాలలో ఐ.జే. యూ.కు అనుబంధంగా సంఘాలు ఏర్పాటు కానున్నాయని , గతం లో చీలి బైటికి వెళ్ళిన మిత్రులు తిరిగి మాతృ సంస్థ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. యూనియన్ పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్.సీన్హా , స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం. ఎ. మాజిద్,  కోశాధికారి ప్రేమ్ నాథ్ భార్గవ్ , ఉపాధ్యక్షులు అమర్ మోహన్ ప్రసాద్, జి. ప్రభాకరన్ , కార్యదర్శులు వై.నరేందర్ రెడ్డి, డి.సోమసుందర్ , డి.ఎస్.ఆర్.సుభాష్ , స్క్రైబ్స్ న్యూస్ ఎడిటర్ ఆలపాటి సురేష్ కుమార్ తదితరులు మాట్లాడారు.

మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ! ఐజేయూ డిమాండ్ !


దేశంలో మీడియా పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పాత్రికేయుల భద్రత కోసం ఒక  ప్రత్యేకచట్టం చేయాలని ఐ.జే. యూ. జాతీయ కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. పట్నా లో ఆగస్ట్ 25,26 తేదీల్లో జరిగిన సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. సమావేశం  పలు తీర్మానాలను ఆమోదించింది. దేశంలో  జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై సమావేశం ఒక తీర్మానంలో  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడులను నిరోధించడానికి , మహారాష్ట్ర , ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు తెచ్చిన చట్టాల తరహాలో కేంద్ర ప్రభుత్వమే ఒక సమగ్రచట్టం చేయాలని సమావేశం ఆ తీర్మానంలో విజ్ఞప్తి చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాత్రికేయులపై బనాయించిన అక్రమకేసులు ఎత్తివేయాలని కోరుతూ  సమావేశం మరో తీర్మానాన్ని ఆమోదించింది. మణిపూర్ ఘటనలపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడంపై సమావేశం నిరసన తెలిపింది.

తక్షణం శాంతి భద్రతల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని వేరొక తీర్మానంలో  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ అక్టోబర్ 2 న దేశవ్యాప్తంగా "డిమాండ్స్ డే"  పాటించాలని ఐ.జే.యు. కార్యవర్గ సమావేశం రాష్ట్రాలలోని యూనియన్లకు  పిలుపు ఇచ్చింది. "కృత్రిమ మేధ - పర్యవసానాలు" అంశంపై న్యూఢిల్లీలో జాతీయస్థాయి సదస్సు నిర్వహించాలని, మహిళా జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్ లో హైదరాబాద్ లో జాతీయసదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో   ప్రధానపాత్ర పోషించిన జాతీయ ఉపాధ్యక్షుడు అమర్ మోహన్ ప్రసాద్, జాతీయ కార్యవర్గ సభ్యులు శివేంద్ర నారాయణ్ సింగ్, బీహార్ రాష్ట్ర అధ్యక్షురాలు నివేదితా ఝా , ప్రధానకార్యదర్శి కమల్ కాంత్ సహయ్ , రవి ఉపాధ్యాయ్ , సీటూ తివారీ ,  జరినా ఫాతిమా తదితరులను జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస రెడ్డి సత్కరించారు.