రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు

రైతుల ఖాతాల్లోకి రూ.3 వేల కోట్లు
  • 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం
  • 20 నాటికి మొత్తం డబ్బులు విడుదల చేస్తాం
  • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణకు సంబంధించి శుక్రవారం నాటికి రైతుల ఖాతాల్లో రూ.3- వేల కోట్లు బదిలీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఈనెల 20 నాటికి రైతులకు అందజేస్తామని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగిలో రైతాంగానికి అండగా ఉండి, ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్ళి  ధాన్యం సేకరణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ యాసంగిలో ఈనెల 15వ తేదీ వరకు 64.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 11 లక్షల మంది రైతుల నుంచి సేకరించామని, వాటి విలువ 13,264 కోట్లు అని తెలిపారు. ఇందులో ఓపీఎం స్లో  నమోదు చేసిన 10,439 కోట్లలో 9,168 కోట్లను రైతులకు అందించామన్నారు. అకాల వర్షాల వంటి విపత్కర పరిస్థితులను అంచనా వేసి పది రోజుల ముందుగానే  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే అధికంగా 7034 కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల వద్దకే వెళ్ళి ధాన్యం సేకరించామని చెప్పారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సేకరణ పూర్తై 6143 కేంద్రాలను మూసి వేశామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తి చేశామని, మిగిలిన జిల్లాలోనూ ఆదివారం వరకు పూర్తి చేస్తామన్నారు. ఎక్కడైనా ఆలస్యంగా వరి కోతలు ప్రారంభించిన రైతుల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు చేసేందుకు వీలుగా కలెక్టర్లకు నిర్ణయాధికారాలు ఇచ్చామన్నారు. గత సీజన్ కంటే 15 లక్షల మెట్రిక్ టన్నులను అధికంగా సేకరించామని మంత్రి వెల్లడించారు. ధాన్యం సేకరణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ యాసంగిలో రాష్ట్రంలో 56,845 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైందని తెలిపారు. అకాల వానల నుంచి పంటలను కాపాడేందుకు రైతులకు అందుబాటులో టార్పాలిన్లు ఉంచామన్నారు. ధాన్యం సేకరణ కేంద్రాలకు అవసరమైన మాయిశ్చర్ మిషన్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు వంటి మౌళిక వసతులను ప్రభుత్వం సమకూర్చిందన్నారు.  తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించామని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.