మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు హెలికాప్టర్ సేవలు …
![మేడారం జాతరకు వెళ్ళే భక్తులకు హెలికాప్టర్ సేవలు …](https://mudranews.in/uploads/images/2024/02/image_750x_65d47280af171.jpg)
ముద్ర, తెలంగాణ: తెలంగాణలో జరిగే మేడారం జాతర కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. వన దేవతలను గద్దెల దగ్గరకు తీసుకొచ్చి ప్రతిష్టించడం నుంచి మొదలుకొని మళ్ళీ వన ప్రవేశం చేయించడం వరకు అన్నీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఒకప్పుడు ఎడ్ల బండ్లతో జరిగిన జాతర ఇప్పుడు హెలికాఫ్టర్ స్థాయికి చేరుకుంది.. ఈసారి కూడా మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 21 నుంచి 25 వరకు హెలికాఫ్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. హన్మకొండ నుంచి హెలికాప్టర్ సేవలు మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం అందుబాటులో ఉంటాయి.
హెలికాఫ్టర్లో వెళ్లే వారికి కోసం ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు. మొక్కులు చెల్లించిన తర్వాత హన్మకొండకు తిరుగు ప్రయాణం ఉంటుంది. మేడారంలోనే ప్రత్యేకంగా హెలికాప్టర్ జాయ్ రైడ్ కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణం చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. హన్మకొండ నుంచి మేడారం జాతరకు ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్తో సహా వీఐపీ దర్శనాన్ని పొందవచ్చు. దీనికి రూ. 28,999 చెల్లించాల్సి ఉంటుంది. హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు ప్రయాణించే వీలు ఉంది. కుటుంబం మొత్తం ఒకే ట్రిప్లో మేడారం వెళ్లడానికి బుక్ చేసుకోవచ్చు.
జాతర జరిగే ప్రాంతం మీదుగా 6 నుంచి 7 నిమిషాల పాటు గాలిలో హెలికాప్టర్ చక్కర్లు కొట్టనుంది. అమ్మ వారి గద్దెల పక్క నుంచి మొదలయ్యే రైడ్ జంపన్న వాగు, చిలుకల గుట్ట పక్కనుంచి చుట్టూరా ఉండే జాతర పరిసరాల మీదుగా ఉంటుంది. దీని ద్వారా మేడారం జాతర ప్రదేశాన్ని విహంగ వీక్షణం చేయొచ్చు. జాయ్ రైడ్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 4800 ఛార్జీ వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ టిక్కెట్లు, ఇతర సమాచారం కోసం 74834 33752, 04003 99999 నంబర్లలో సంప్రదించవచ్చు. infor@helitaxi.com లో ఆన్లైన్ లో సంప్రదించ వచ్చు భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..