క్షేత్ర పరిశీలనలో అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ ను వెంటనే పరీక్షించాలి

క్షేత్ర పరిశీలనలో అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ ను వెంటనే పరీక్షించాలి
  • నకీలీ విత్తనాల నియంత్రణకు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ ల ద్వారా పర్యవేక్షణ చేయాలి
  • వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి


ముద్ర ప్రతినిధి, జగిత్యాల : రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపి అరికట్టాలని, దీని ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డి.జి.పి. అంజనీ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి వానాకాలం సీజన్ ముందస్తు ఏర్పాట్లపై వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నదని, గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 4.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని, దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న  రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా  ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్ లో దాదాపు మాయమయ్యాయి అని, అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60% మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ ఆవిర్భవించిందని మంత్రి తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాష, ఎస్పీ భాస్కర్, జిల్లా అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.