ఐఏఎస్ కావాలనుకున్నాడు.. వీధి వక్రీకరించి మృత్యు ఒడిలోకి ప్రభుత్వ ఉపాధ్యాయుడు
పెద్దశంకరంపేట, ముద్ర: పుట్టుకతోనే తండ్రిని కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆ కుటుంబానికి తల్లే అన్ని తానై ముగ్గురు పిల్లలను పోషించింది. కుట్టు మిషన్ కుట్టుకుంటూ వచ్చిన చాలీచాలని ఆదాయంతో పిల్లలను పెద్ద చేసి కూతురుకు పెళ్లి చేసింది. ఇద్దరు కుమారులు జీవితంలో స్థిరపడ్డారునుకొని ఆశపడ్డ తల్లి ఆనందం ఆవిరైంది. అ విధి రాతతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంటది. పెద్ద శంకరంపేట గ్రామానికి చెందిన అర్ఎం సాయి కిషోర్ తన తల్లి కష్టార్జితంతో చదువులలో రాణించి విద్యార్థి దశ నుంచి ఎంతో ప్రతిభ కనబరిచి సంగారెడ్డి జిల్లా కాశీపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఐఏఎస్ కావాలనే లక్ష్యం, పట్టుదలతో చదువుతున్న అతనికి హెపటైటిస్-బి సోకటంతో హైదరాబాదు గచ్చిబౌలిలోని ప్రముఖ ఆసుపత్రి ఎఐజిలో చికిత్స చేయించారు. స్థాయికి మించి డబ్బులు ఖర్చు చేసినా ఫలితం అందలేదు. చివరికి మృత్యువుతో పోరాడి శనివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. ఈ వార్త తెలిసి శంకరంపేట పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్ననాటి నుంచి సాయి కిషోర్ విద్యలో ప్రతిభ కనబరచాడని ఎప్పుడూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా ఉండేవాడని, గ్రామ ప్రజలు అతన్ని తలుచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కిషోర్ భౌతిక కాయానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ విగ్రాం శ్రీనివాస్ గౌడ్, పిఆర్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు అసురి రామచంద్ర చారి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళీ పంతులు, సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ దశరథ్, ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్, అర్ఎన్ సంతోష్, గాండ్ల సంగమేశ్వర్, ఉపాధ్యాయులు నివాళులు అర్పించారు.