17న పాలిసెట్
![17న పాలిసెట్](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6462295a791c6.jpg)
- మెదక్ జిల్లాలో ఐదు కేంద్రాలు ఏర్పాటు
- నిమిషం ఆలస్యమైనా అనుమతివ్వరు
- మెదక్ జిల్లా కో–ఆర్డినేటర్ డా.సువర్ణలత
ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్రంలోని ప్రభుత్వ. ప్రైవేట్ పాలిటెక్నిక్లలోని మూడు సంవత్సరాల ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా ప్రవేశం కోసం ఈనెల 17న పాలిటెక్నిక్ (పాలిసెట్)-2023 పరీక్షను నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా కో–ఆర్డినేటర్, మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సువర్ణలత తెలిపారు. ఈనెల 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాల్లో 1, 933 మంది విద్యార్థులు హాజరవుతారని సువర్ణలత తెలిపారు.
ఈ పరీక్షలు మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ హౌసింగ్ బోర్డు కాలనీ, సిద్దార్థ్ ఆదర్శ్ జూనియర్ కాలేజీ, గీతా జూనియర్ కాలేజీ, సిద్దార్థ్ మోడల్ హైస్కూళ్ళలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సువర్ణలత వివరించారు. ఈ పరీక్షకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక గంట ముందుగానే ఉదయం 10 గంటలకే అనుమతిస్తారని, విద్యార్థులు అప్పటికే తమ సెంటర్లకు చేరుకొని ఓఎమ్ఆర్ షీట్లో రెండువైపులా పూర్తి వివరాలతో సంతకం చేయాల్సి ఉంటుందని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ వెంట హెచ్బీ, 2 బీ బ్లాక్ పెన్సిల్, ఎరేసర్, బ్లూ, బ్లాక్ పెన్నులు తప్పక తీసుకురావాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్ మీద ఫొటో రానట్లయితే వారు ఒక పాస్పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించబడవన్నారు.