నకిలీ విత్తనాల పై ఉక్కుపాదం 

నకిలీ విత్తనాల పై ఉక్కుపాదం 
  •  9 ఏళ్లలో  4.5 లక్షల కోట్లు కేటాయించాం 
  • దేశానికే విత్తన బాండాగారం తెలంగాణ
  • రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని, నకిలీ విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.వానాకాలం సీజన్ పంటల ప్రణాళిక, విత్తనాల సరఫరా, నకిలీ విత్తనాలను అరికట్టడం పై హైదరాబాద్ లోని  సచివాలయం నుండి అయన డిజిపి అంజనీ కుమార్,  రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పోలీస్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులతో  మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు, కోట్లాది మందికి ఉపాధి కల్పించడం జరుగుతోందని, గడిచిన 9 ఏళ్లలో వ్యవసాయ రంగానికి దాదాపు 4.5 లక్షల కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. దేశంలో మన కంటే రెండు, మూడు రెట్లు పెద్ద రాష్ట్రాల్లో సైతం ఇంత భారీగా ఖర్చు చేయలేదని మంత్రి అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న  రైతు అనుకూల విధానాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, రైతులకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా  ముందస్తు ప్రణాళికలు రూపొందించుకొని నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సమయానికి అందించడంతో పాటు పంట దిగుబడి అధికంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువుల ను స్టాక్ ఉంచుకోవాలని, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా ప్రస్తుత కాలంలో నకిలీ విత్తనాలు మార్కెట్ లో దాదాపు మాయమయ్యాయని, అక్కడక్కడ ఉన్న కొన్ని నకిలీలను పూర్తిగా అరికట్టాలని, అమాయకులకు ఇబ్బంది కలిగించరాదని, క్షేత్ర స్థాయిలో సమాచారం సేకరించి పక్క రాష్ట్రాల నుండి వచ్చే నకిలీ విత్తనాలు, ఎరువులపై దృష్టి పెట్టి నకిలీ విత్తనాలను పకడ్బందీగా నియంత్రించాలని అన్నారు.దేశంలో ఉన్న విత్తన అవసరాలలో దాదాపు 60% మేర తెలంగాణ నుంచి సరఫరా చేస్తున్నామని, దేశానికి విత్తన బాండాగారంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తెలిపారు.తెలంగాణలో ఉన్న విత్తన ఉత్పత్తి పరిశ్రమకు ఇబ్బంది కలగకుండా, నకీలీ విత్తనాల నియంత్రణపై పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని మంత్రి అన్నారు . ఈ సమావేశంలో డి ఐ జి రమేష్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సిపి సుబ్బారాయుడు, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, శిక్షణ జాయింట్ కలెక్టర్ నవీన్ నికోలస్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.