రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉంది: వైఎస్ షర్మిల

రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉంది: వైఎస్ షర్మిల
Ys Sharmila fire on Cm KCR

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ 420 అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. మంగళవారం చిల్పూర్, ధర్మసాగర్, జఫర్గడ్ మండలాలలో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సార పోసినట్లు ఉంది అన్నారు. గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చుల మీద సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు 12 వేల కోట్లు, దళిత బందుకు 17 వేల కోట్లు పెట్టారు. కానీ కేటాయింపులకు, ఖర్చులకు పొంతనే లేదు అన్నారు. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు మాటలు కోటలు దాటుతాయి చేతలు మాత్రం గడప దాటవని ఎద్దేవ చేశారు.

దేవాదుల, కంతనపల్లి, డిండి, ఎస్ఎల్ బి సి, సీతారామ, నక్కలగండి ప్రాజెక్టులను ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 1 లక్షా 20 వేల కోట్ల కాలేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకు మునిగిందన్నారు. వైఎస్సార్ 38 వేల కోట్ల తో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే మూడింతలు పెంచి 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు రిచ్చారన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 36 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారని, రైతును రారాజు చేస్తే ఆత్మహత్యలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. సున్నా వడ్డీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు మొదలైన హామీలు నెరవేర్చని కెసిఆర్ 420 కాకుండా ఇంకేమవుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మీ కుటుంబం అని చెప్తే మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ కుటుంబం కోసం అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు.