సమస్యల పరిష్కారానికి కార్మిక కార్యాలయం దోహదం - జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

సమస్యల పరిష్కారానికి కార్మిక కార్యాలయం దోహదం - జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: సమస్యల పరిష్కారానికి సహాయ కార్మిక అధికారి కార్యాలయం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ లో గల ఎన్ఆర్ సి భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన నూతన సహాయ కార్మిక అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిల  చేతులమీదుగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  భూపాలపల్లి జిల్లాలో లేబర్ కార్యాలయం లేకపోవడం వల్ల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, ఇలాంటి ఇబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రస్తుతం సహాయ కార్మిక అధికారి కార్యాలయ నిర్వహణకు తాత్కాలికంగా ఏర్పాటు చేశామని,  నెలరోజుల్లో జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభమవుతుందని, అక్కడ మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు లేబర్ కార్యాలయానికి స్థలం అందిస్తామని , కార్మీకుల సంక్షేమం కొరకు కార్మిక భవనం నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1991 సమయంలో 4వేల మంది ఓటర్లు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 70 వేలకు పెరిగిందని, పట్టణంలో విస్తృతంగా కార్మికుల సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం, కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ప్రైవేట్ రంగంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటిలో పనిచేసే కార్మికులకు నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 

కార్మికుల కార్యాలయంలో ప్రతివారం రివ్యూ నిర్వహించి, సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్, కార్మిక కార్యాలయం ఏర్పాటు కాలేదని, వీటి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా మంజూరు చేశారని తెలిపారు. భూపాలపల్లిలో ఉన్న సింగరేణి కార్మికులు జెన్ కో కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు ఇకనుండి సహాయ కార్మిక అధికారి కార్యాలయం అందుబాటులో ఉంటుందని, సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మికుల కోసం రెండు అడ్డాలు ఏర్పాటు చేయాలని, కార్మికుల అడ్డా వద్ద వారు కూర్చునేందుకు వీలుగా షెడ్, టాయిలెట్ సౌకర్యంతో ఏర్పాటు చేయాలని, దాని దిశగా జిల్లా కలెక్టర్ తో సహాయ కార్మిక అధికారి సమన్వయం చేసుకొని కృషి చేయాలని సూచించారు. ‌కార్మీకుల కు ప్రభుత్వం నుంచి అందించే వివిధ పథకాలు, పరిహారం క్లెయిమ్ సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని అధికారులకు సూచించారు. కార్మికుల కార్యాలయానికి అవసరమైన మేర సిబ్బంది ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తాత్కాలికంగా కలెక్టరేట్ నుంచి కొంత సిబ్బందిని కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం కార్మికులకు ఈ శ్రమ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ కమిషనర్ సామ్యూల్, జాయింట్ కమిషనర్ సునీత, కార్మిక అధికారి వినోద వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.