నగరంలో ఐటెక్ న్యూక్లెస్ ఐటీ టవర్
![నగరంలో ఐటెక్ న్యూక్లెస్ ఐటీ టవర్](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_651bb4b879303.jpg)
- నిర్మాణ పనులు ప్రారంభించిన కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటెక్ న్యూక్లెస్ ఐటీ టవర్ ను నిర్మిస్తున్నామని మినిస్టర్కేటీఆర్ తెలిపారు. మొదటి విడతగా 10.35 ఎకరాల్లో రూ.700 కోట్లతో 21 అంతస్తులతో 20 లక్షల చదరపు అడుగుల్లో ఈ టవర్ను నిర్మిస్తున్నామన్నారు. మూడేళ్లలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సోమవారం హైదరాబాద్ మలక్పేటలో ఐటెక్ న్యూక్లెస్ ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు.
50 వేల మందికి ఉపాధి అవకాశాలు..
ఐటెక్ న్యూక్లెస్ టవర్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50 వేల ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఐటీ రంగం దూసుకెళ్తున్నదన్నారు. వరుసగా రెండు సంవత్సరాలపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ కల్పిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాలసీలు, నగర అభివృద్ధి వలన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు నగరంలో భారీగా తమ కార్యకలాపాలను విస్తరించాయన్నారు. మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి పెద్దకంపెనీలు ఇక్కడకు తీసుకొస్తున్నామన్నారు.
ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొస్తాం..
ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి కేటీఆర్చెప్పారు. మూసీ సుందరీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్లో గతంలో తరచూ కర్ఫ్యూ పరిస్థితులు ఉండేవని, సీఎం కేసీఆర్ పాలనలో తొమ్మిదేండ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. ఇతర నగరాలకు, రాష్ట్రాలకు భిన్నంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదన్నారు. హైదరాబాద్ నగరం గతంలో ఎన్నడు లేనంత ప్రశాంతంగా 10 సంవత్సరాలలో ఉన్నదన్నారు. గణేశ్నిమజ్జనాన్ని పురస్కరించుకొని మిలాద్–ఉన్–నబీ ఉరేగింపును వాయిదా వేసుకుని హైదరాబాద్ నగరానికి ప్రత్యేకమైన గంగా జమున తెహజీబ్ సంస్కృతికి అద్దం పట్టారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తలసరి ఆదాయం సహా పలు అంశాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను అధిగమించామని చెప్పారు. దేశానికి రాష్ట్రం ధాన్యాగారంగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వల్ప కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.