ఎన్నికల రూట్స్ పాటించకపోతే చర్యలు తప్పవు - కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి
![ఎన్నికల రూట్స్ పాటించకపోతే చర్యలు తప్పవు - కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_654b50b39783b.jpg)
ముద్ర,హుజూరాబాద్ : ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలకు లోబడి అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మహాంతి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కార్యాలయంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజును అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో ఎన్నికలప్రచారంలో రూట్స్ అతిక్రమణపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశాలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు ఉంటాయన్నారు. నియోజకవర్గంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తిస్తున్నామని, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించే వ్యక్తులు, నేరాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేశామని, నిఘా పెంచామని తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులుముందుకు వెళ్లాలన్నారు.ఈ సమావేశంలో ఏసీపీ జీవన్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.